- కేటీఆర్, హరీశ్పై వచ్చిన ఆరోపణలను సీరియస్గా తీసుకోవాలి: ఎంపీ అర్వింద్
నిజామాబాద్, వెలుగు: కేటీఆర్, హరీశ్ రావుపై కవిత చేసిన అవినీతి, క్విడ్ ప్రోకో ఆరోపణలపై సీఎం రేవంత్రెడ్డి సీబీఐ విచారణ కోరాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం బీజేపీ జిల్లా ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫండ్లు, నిర్మాణ సంస్థలకు ఇచ్చిన అనుమతులు, గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రా వాళ్లకు కేటాయించిన భూములపై కవిత చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవద్దన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు జరిగాయని తేలినా హరీశ్ రావుపై చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్రెడ్డి వెనకడుగు వేశారని ఆరోపించారు. విచారణ కమిషన్ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ఈ-కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై, ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధ్యులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అర్వింద్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని, అందుకే ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదని ఆరోపించారు. కవిత చేసిన ఆరోపణలపై కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధం బయటపడినట్టేనన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్కు రోజులు దగ్గరపడ్డాయని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.
