ఎయిర్ పోర్టులపై సైబర్ ఎటాక్.. ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కీలక సూచన

ఎయిర్ పోర్టులపై సైబర్ ఎటాక్.. ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కీలక సూచన

న్యూఢిల్లీ: యూరప్‌లోని అనేక విమానాశ్రయాలపై సైబర్ ఎటాక్ జరిగింది. బ్రస్సెల్స్, హీత్రో, బ్రాండెన్ బర్గ్ వంటి ప్రముఖ ఎయిర్ పోర్టులు సైబర్ దాడికి గురయ్యాయి. చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ సర్వీస్ ప్రొవైడర్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. సైబర్ దాడి కారణంగా పలు ఎయిర్ పోర్టుల్లో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాశ్రయాల్లో మాన్యువల్ పద్దతిలో చెక్-ఇన్ ప్రక్రియ చేపట్టారు ఎయిర్ పోర్టు అధికారులు. కొన్ని ఎయిర్ లైన్స్ విమానాలను రద్దు చేశాయి. 

ఎయిర్ పోర్టులపై సైబర్ దాడి నేపథ్యంలో ప్రయాణికులకు కీలక సూచన చేసింది ఎయిర్ ఇండియా. ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు వచ్చే ముందు తమ వెబ్ చెక్-ఇన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. హీత్రోతో పాటు కొన్ని ఎయిర్ పోర్టుల్లో మాన్యువల్ పద్దతిలో చెన్ ఇన్ చేస్తోన్న నేపథ్యంలో ఆలస్యం జరుగుతోందని.. అందుకే  వెబ్ చెక్-ఇన్‌ చేయడం ద్వారా ఆలస్యం కాకుండా చెన్ ఇన్ ప్రాసెస్ ఈజీ అవుతోందని పేర్కొంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సిబ్బంది గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి పనిచేస్తున్నాయని ప్రకటనలో తెలిపింది ఎయిర్ ఇండియా. 

సైబర్ దాడి కారణంగా పలు ఎయిర్ పోర్టుల్లో మాన్యువల్ పద్దతిలో చెక్ ఇన్ చేయడంతో తీవ్ర జాప్యం ఏర్పడింది. బ్రస్సెల్స్ విమానాశ్రయంలో చాలా విమానాలు రద్దు చేశారు. లండన్ హీత్రో ఎయిర్ పోర్టులో కూడా సైబర్ దాడి వల్ల విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. మాన్యువల్ మోడ్‎లో చెక్ ఇన్ చేపడుతున్న నేపథ్యంలో ప్రయాణికులు రెండు గంటలు ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించారు అధికారులు. ప్రయాణీకులు ఎయిర్ పోర్టులకు వెళ్లే ముందు వారి సంబంధిత విమానయాన సంస్థలతో ఫ్లైట్ డిటైయిల్స్ తెలుసుకోవాలని సూచించారు.

సైబర్ దాడి కారణంగా విమాన సేవలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలలో వివిధ ఎయిర్ లైన్స్ సంస్థలకు చెక్-ఇన్, బోర్డింగ్ పాస్ సర్వీస్ అందించే కాలిన్స్ ఏరోస్పేస్ సంస్థ సైబర్ ఎటాక్‎ను ధృవీకరించింది. సేవలను పునరుద్ధరించడానికి కంపెనీ చురుకుగా పని చేస్తోందని తెలిపింది. సైబర్ దాడి కారణంగా  ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల విచారం వ్యక్తం చేసింది.