
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఖర్చును తగ్గించుకోవడమే లక్ష్యంగా పలు విమానయాన సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పనితీరు సరిగ్గా లేదని భావిస్తున్న ఉద్యోగులను నిర్బంధ సెలవుపై ఐదేళ్ల వరకూ పంపాలని భావిస్తోంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని సీఎండీ (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్) రాజీవ్ భన్సాల్ కు అప్పగిస్తూ, ఎయిర్ ఇండియా బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది.
ఉద్యోగుల సూటబిలిటీ, ఎఫిషియన్సీ, కాంపిటెన్సీ, క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, హెల్త్ తదితరాలతో పాటు ఇటీవలి కాలంలో పెట్టిన సెలవులు తదితరాలను లెక్కలోకి తీసుకుని ఎవరిని సెలవులపై పంపించాలన్న విషయమై సిఫార్సులు చేస్తారని ఏఐ అధికారులు తెలిపారు. బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం మొదట ఆరు నెలలపై ఉద్యోగులను సెలవుపై పంపించే అధికారం రాజీవ్ బన్సాల్ దే. ఆపై సెలవును రెండు సంవత్సరాలకు, ఆపై అవసరమైతే ఐదేళ్ల వరకూ పొడిగించేందుకు కూడా సీఎండీకి అధికారం ఉంటుంది. ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయాల హెడ్స్, రీజనల్ డైరెక్టర్లు తమ పరిధిలోని ఉద్యోగుల పనితీరును లెక్కలోకి తీసుకోనున్నారు. వారి పేర్లను హెడ్ క్వార్టర్స్ లోని పర్సనల్ విభాగం జీఎంకు పంపుతారు. ఆపై దాన్ని సీఎండీ అనుమతి కోసం పంపనున్నారు. కాగా, ఎయిర్ ఇండియాను అమ్మాలని కేంద్రం భావిస్తున్న సమయంలో సంస్థ ఇటువంటి నిర్ణయం చర్చనీయాశమైంది.