హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులకు భారీగా ఫీజులు పెంచడం సరికాదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో సోమవారం నిర్వహించిన ఆ సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు.
విద్యార్థులకు రావాల్సిన రూ.9,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని విజ్ఙప్తి చేశారు. విద్యా కమిషన్ రూపొందించిన నివేదికపై విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, మేధావులతో ప్రభుత్వం బహిరంగ చర్చ జరపాలని కోరారు.
