రామయ్య సన్నిధిలో అఖండ హరేనామ జపయజ్ఞం.

రామయ్య సన్నిధిలో అఖండ హరేనామ జపయజ్ఞం.

భద్రాచలం, వెలుగు: ప్రసిద్ధ శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో మంగళవారం ఆంధ్రాలోని యుద్ధనపూడి మండలం పెద్దజాగర్లమూడికి చెందిన శ్రీరామ షిర్డీ సాయిభక్త సమాజం భక్తులు అఖండ హరేనామ జపయజ్ఞ సప్తాహం చేశారు. ఈనెల 24న పెద్ద జాగర్లమూడిలో ప్రారంభమైన ఈ సప్తాహం బుధవారం భద్రాచలంలో పూర్ణాహుతితో ముగియనుంది. భక్తులు హనుమాన్​చాలీసా పారాయణం చేశారు. గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తమలపాకులు, అప్పాలు, మాలలను స్వామికి నివేదించారు. 

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం..

శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన డి.రవికల్యాణ్, హారిక దంపతులు రూ.1,01,116లను విరాళంగా ఇచ్చారు. తన తల్లిదండ్రులైన అప్పారావు, శ్రీవల్లి పేరిట భక్తులకు అన్నదానం నిర్వహించాలని వారు కోరారు. టెంపుల్​సూపరింటెండెంట్ సాయిబాబుకు చెక్కును అందజేశారు.