హైదరాబాద్ సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) 26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహించనునున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. మౌలాలీలోని ఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంలో ఈ పోటీలు జరుగనున్నాయి. తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ బి.శివధర్ రెడ్డి గెస్ట్గా పాల్గొంటారు.
1999లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర పారా -మిలిటరీ దళాలు రొటేషన్ పద్ధతిలో నిర్వహిస్తున్నాయన్నారు. దీనిని ఇప్పుడు అఖిల భారత పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఆర్పీఎఫ్కు కేటాయించింది. ఏపీ, అస్సాం పోలీస్, అస్సాం రైఫిల్స్, బిహార్, బీఎస్ఎఫ్, చత్తీస్గఢ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఐటీబీపీ, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, తమిళనాడు, తెలంగాణ, కేంద్ర పారా-మిలిటరీ దళాల నుంచి సుమారు 24 జట్లు, 1500 మంది ప్రదర్శనకారులు ఈ పోటీలో పాల్గొననున్నారు.
