
‘‘ఇంటర్ బోర్డు అవకతవకల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరాం. ప్రభుత్వం స్పందించలేదు. దీంతో భిక్షాటన చేసైనా సర్కారు కళ్లు తెరిపించాలని నిర్ణయించాం. కానీ ఇలా అక్రమంగా అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్య’’ అని అఖిలపక్షం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను ఆదుకునేందుకు శనివారం చార్మినార్ వద్ద అఖిలపక్షం నేతలు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం చాడ వెంకట్రెడ్డి(సీపీఐ), ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి (టీడీపీ), కోదండరాం (టీజేఎస్), అంజన్ కుమార్ యాదవ్, వినోద్రెడ్డి(కాంగ్రెస్)లతోపాటు పలువురిని అరెస్ట్ చేసి ఫలక్నుమా పోలీస్స్టేషన్కు తరలించారు. తర్వాత విడుదల చేశారు.