
భారత న్యాయవ్యవస్థలో స్వతంత్రత, పారదర్శకత అంశాలపై తీవ్ర చర్చకు దారి తీసిన న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు మరో కీలక మలుపు తిరిగింది. అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు, వాటిపై సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక గోప్యత ఇప్పటికీ వీడలేదు. నేటికి కూడా ఈ నివేదికను ప్రజల ముందుకు తీసుకురావాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒక ఉన్నత న్యాయమూర్తికి సంబంధించిన ఈ అంశం కేవలం వ్యక్తిగత వివాదం కాదని, దేశ న్యాయవ్యవస్థ విశ్వసనీయత, జవాబుదారీతనానికి అద్దం పట్టే కీలకమైన అంశంగా మారింది.
న్యాయవ్యవస్థ తన స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను ఈ కేసు మరోసారి స్పష్టంగా గుర్తు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం దాని పారదర్శకతపై
ఆధారపడి ఉంటుంది.
ఈ వివాదం మూలాలు జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుంచి మొదలయ్యాయి. గత సంవత్సరం (మార్చి 14, 2024న) ఆయన ఢిల్లీలోని అధికారిక నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదం సమయంలో, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే క్రమంలో ఒక గదిలో గుర్తించిన లెక్కలేనంత నగదు గురించి వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి, ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
64 పేజీల నివేదిక
జస్టిస్ వర్మ తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన ఇంట్లో అలాంటి నగదు లేదని, ఇది తనను ఇరికించే కుట్ర అని ఆయన స్పష్టం చేశారు. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా త్రిసభ్య కమిటీతో అంతర్గత విచారణకు ఆదేశించారు. లీగల్ న్యూస్ వెబ్సైట్ బార్ అండ్ బెంచ్ ప్రచురించిన 64 పేజీల నివేదిక ప్రకారం, ఈ కమిటీ జస్టిస్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్రూమ్లో నగదు లభ్యమైనట్లు నిర్ధారించింది. నివేదికలో జస్టిస్ (యశ్వంత్) వర్మ అధికారికంగా ఆక్రమించిన 30 తుగ్లక్ క్రెసెంట్, న్యూఢిల్లీలోని స్టోర్రూమ్లో నగదు/డబ్బు లభ్యమైంది. ‘అంతేకాకుండా, స్టోర్ రూమ్కు ప్రవేశం జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల రహస్య నియంత్రణలో ఉందని కనుగొనడమైంది. బలమైన ఊహాజనిత ఆధారాల ద్వారా మార్చి 15, 2024 తెల్లవారుజామున 30 తుగ్లక్ క్రెసెంట్, న్యూఢిల్లీ నుంచి కాలిన నగదు/ డబ్బు తొలగించడం జరిగింది" అని స్పష్టంగా పేర్కొంది.
త్రిసభ్య కమిటీ సిఫార్సు
జస్టిస్ వర్మ దుష్ప్రవర్తన (misconduct) వల్ల ఆయనను న్యాయమూర్తిగా తొలగించడానికి, తగిన చర్యలు (initiation of proceedings for removal of Justice Varma) ప్రారంభించడానికి సరిపోతుందని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. ఈ విచారణలో త్రిసభ్య కమిటీ 10 మంది సాక్షులను విచారించింది. ఈ సాక్షులందరూ కాలిన లేదా సగం కాలిన కరెన్సీ నోట్లను చూసినట్లు అంగీకరించారని నివేదిక వెల్లడించింది. కమిటీ నివేదికలో, సీజేఐ జారీ చేసిన లేఖ (తేదీ మార్చి 22, 2025)లో లేవనెత్తిన ఆరోపణలలో తగినంత సారం ఉందని, రుజువైన దుష్ప్రవర్తన కారణంగా న్యాయమూర్తి యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించడానికి, తగిన చర్యలు ప్రారంభించడానికి సరిపోతుందని స్పష్టంగా పేర్కొంది. ఈ నివేదికను సీజేఐ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి కూడా సమర్పించినట్లు తెలుస్తోంది.
పదవి నుంచి తొలగించాలంటే..
సుప్రీంకోర్టు అంతర్గత త్రిసభ్య కమిటీ జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించడానికి తగిన చర్యలు ప్రారంభించాలని స్పష్టంగా సిఫార్సు చేసిన నేపథ్యంలో, భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించే ప్రక్రియ (అభిశంసన) ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం. న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే ప్రక్రియ రాజ్యాంగంలోని అధికరణలు 124(4), 124(5)ల ద్వారా, అలాగే ‘న్యాయమూర్తుల విచారణ చట్టం, 1968' ద్వారా జరుగుతుంది. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని కాపాడుతూనే, వారి జవాబుదారీతనాన్ని నిర్ధారించే ఒక కీలకమైన యంత్రాంగం.
ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా, దశలవారీగా జరుగుతుంది. ఒక న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించాలనే ప్రతిపాదనను లోక్సభలో కనీసం 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు సంతకాలతో స్పీకర్కు (లోక్సభ) లేదా చైర్మన్కు (రాజ్యసభ) సమర్పించాలి. ఈ ప్రతిపాదనలో 'దుష్ప్రవర్తన' (misbehaviour) లేదా 'అసమర్థత' (incapacity) వంటి నిర్దిష్ట, తీవ్రమైన కారణాలు స్పష్టంగా పేర్కొనాలి. ఇది కేవలం ఆరోపణ కాకుండా బలమైన ప్రాథమిక
ఆధారాలతో కూడిన ప్రతిపాదనై ఉండాలి.
ముగ్గురు సభ్యుల కమిటీ
స్పీకర్/ చైర్మన్ ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే, వారు ఆరోపణలను లోతుగా విచారించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి (లేదా చీఫ్ జస్టిస్), హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక ప్రముఖ న్యాయ నిపుణుడు ఉంటారు. ఈ కమిటీ న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణల యధార్థతను స్వతంత్రంగా, నిష్పాక్షికంగా విచారిస్తుంది.
విచారణ కమిటీ ఆరోపణలపై పూర్తి విచారణ జరిపి, న్యాయమూర్తికి తన వాదనలు వినిపించే అవకాశం కల్పించిన తర్వాత ఒక సమగ్ర నివేదికను సమర్పిస్తుంది. నివేదికలో న్యాయమూర్తిపై ఆరోపణలు నిరూపించినట్టు పేర్కొంటే, తొలగింపు ప్రక్రియ పార్లమెంటులో ముందుకు సాగుతుంది. జస్టిస్ వర్మ కేసులో అంతర్గత ప్యానెల్ నివేదిక, 'దుష్ప్రవర్తన' తీవ్రమైనదని నిర్ధారిస్తూ, న్యాయమూర్తి యశ్వంత్ వర్మ, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి చర్యలు ప్రారంభించమని స్పష్టంగా సిఫార్సు చేసింది. ఇది రాజ్యాంగబద్ధమైన అభిశంసన ప్రక్రియ వైపు ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణిస్తారు.
పార్లమెంట్లో ఆమోదమైతేనే..
కమిటీ నివేదికను పార్లమెంటు ఉభయ సభలలో - లోక్సభ, రాజ్యసభలో- చర్చకు పెడతారు. ప్రతిసభలో, ఆ తీర్మానం ఆమోదించాలంటే మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ అవసరం. హాజరైన, ఓటు వేసిన సభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల మద్దతు అవసరం. ఈ దశ చాలా కఠినమైనది. పార్లమెంటులో విస్తృత ఏకాభిప్రాయం లేకుండా న్యాయమూర్తిని తొలగించడం దాదాపు అసాధ్యం. ఉభయ సభలలో తీర్మానం ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వులు జారీ అయిన తక్షణమే, సంబంధిత న్యాయమూర్తి పదవిలో ఉండటానికి అనర్హులు అవుతారు.
- డా.కట్కూరి
సైబర్ సెక్యూరిటీ, న్యాయ నిపుణుడు