హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు పేరుతో రాష్ట్ర పోలీసులు బీజేపీని ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ జి.ప్రేమేందర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం హైకోర్టు విచారించనుంది. ఈ విషయాన్ని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ భాస్కర్రెడ్డిల డివిజన్ బెంచ్ సోమవారం ప్రకటించింది. సింగిల్ జడ్జి ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును నిలిపివేస్తూ ఇచ్చిన ఆర్డర్ను రద్దు చేయడాన్ని పిటిషన్లో బీజేపీ సవాల్ చేసింది. బీజేపీని దోషిగా నిలబెట్టే కుట్ర జరుగుతున్నదని, సీఎం, టీఆర్ఎస్ అగ్రనేతలు దర్యాప్తునకు ముందే ఏం జరగబోయేదీ విలేకరుల సమావేశంలో చెప్పేశారని పిటిషన్లో పేర్కొన్నారు. మొయినాబాద్ ఫాంహౌస్లో అక్టోబర్ 26న ఈ ఘటన జరిగితే.. మధ్యవర్తుల సంతకాలు అక్టోబర్ 27న ఉన్నాయని గుర్తు చేశారు. దీన్నిబట్టి చూస్తే పక్కా ప్లాన్ ప్రకారమే బీజేపీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోందని వివరించారు. ఈ కేసును సీబీఐకి లేదా హైకోర్టు నియమించే సిట్కు అప్పగించాలని కోరారు. ఘటన జరిగిన వెంటనే నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్కు తరలించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.