
హైదరాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ పచ్చదనం, పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఆలిండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో ఈ నెల 31 నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించారు. 6 రోజుల పాటు ఈ షో కొనసాగుతుందని వివరించారు. సోమవారం మంత్రి హరీశ్రావు, హార్టీకల్చర్ షో ఇన్చార్జ్ ఖాలీద్ అహ్మద్తో కలిసి 14వ గ్రాండ్ నర్సరీ మేళా బ్రోచర్ను ఆవిష్కరించి, మాట్లాడారు.
పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇండస్ట్రీ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని తెలిపారు. హాట్ క్లైమెట్ యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, న్యూ వెరైటీ ప్లాంట్స్, హైడ్రోఫోనిక్, టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్ వంటి కొత్త టెక్నాలజీ ఈ షోలో ప్రదర్శిస్తారని చెప్పారు. దేశవ్యాప్తంగా 150కు పైగా నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 5 దాకా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా షో కొనసాగుతుందన్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన టిష్యూ కల్చర్ వెరైటీ డేట్ ఫామ్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని వివరించారు.