
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో 2024–25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను గురువారం కేటాయించారు. దోస్త్ ఫేజ్-1లో మొత్తం 76,290 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఆర్ట్స్ గ్రూప్ లో 7,766 మందికి, కామర్స్ గ్రూప్ లో 28,655, లైఫ్ సైన్సెస్ గ్రూప్ లో 15,301, ఫిజికల్ సైన్సెస్ గ్రూప్ లో 14,964, డేటా సైన్స్ గ్రూప్ లో 2,502, డీ ఫార్మసీ గ్రూప్ లో 90, ఇతర గ్రూపుల్లో 7,012 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. కాగా..
ఫేజ్-1లో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి మొత్తం 1,04,784 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక రెండో విడత ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 6 నుంచి 13 మధ్య జరుగుతుంది. 6 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెల 18న దోస్త్ రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడో విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 19 నుంచి 25 వరకు కొనసాగుతాయి. 19 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు, జులై 2న మూడో విడత సీట్లు కేటాయిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,066 డిగ్రీ కాలేజీలు ఉండగా, వాటిలో 135 ప్రభుత్వ, 86 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో వివిధ కోర్సులకు సంబంధించి 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నిరుడు 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిలో 2.05 లక్షల స్టూడెంట్లు ప్రవేశాలు పొందారు. ఇక జులై 8 నుంచి డిగ్రీ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.