స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమాకి సంబంధించి సోమవారం సాయంత్రం యుసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో మ్యూజికల్ కన్సర్ట్ జరిగింది. ఈ కన్సర్ట్ లో హీరో అల్లు అర్జున్ తన తండ్రి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.
” నాన్న గురించి నేను, నాగురించి నాన్న ఎప్పుడూ స్టేజ్పై చెప్పుకోలేదు. నన్ను హీరోగా లాంచ్ చేసింది నాన్నే . సభాముఖంగా ఆయనకు ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోలేదు. కానీ ఈరోజు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ కేవలం నాతో సినిమా చేసినందుకే కాదు.. కొడుకు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే. నేను మా నాన్నంత గొప్పగా ఎప్పుడూ కాలేను. ఆయనలో సగం కూడా కాలేను. నాన్నలో సగం ఎత్తుకు ఎదిగితే చాలనే ఫీలింగ్ కలుగుతుంది. మా నాన్నను నేను ప్రేమించినంతగా మరేవరినీ ప్రేమించను. నేను చాలా మందిని చూసుంటాను. నేను చూసిన వారిలో ది బెస్ట్ పర్సన్ మానాన్నే. 45 ఏళ్లుగా ఓ వ్యక్తి సినిమాలు, వ్యాపారం చేస్తున్నారు. మనిషిలో ప్యూరిటీ లేకపోతే ఇవాళ సౌత్ ఇండియాలో, ఇండియాలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ క్రింద ఉండలేరు.మా తాతగారికి పద్మశ్రీ వచ్చింది. అలాగే మా నాన్నగారికి కూడా పద్మశ్రీ రావాలనే కోరిక ఉండేది. కాబట్టి మా నాన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని సభావేదిక నుండి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన అందుకు అర్హుడు. ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు.” అని అన్నాడు బన్ని.
డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ..” ఇంత మందిని కలిపి ఆనందం ఇచ్చేది డైరెక్టరే. మేం టూల్స్ అయితే. వాటిని ఉపయోగించుకునే వాడు డైరెక్టర్ మాత్రమే. అలాంటి త్రివిక్రమ్గారితో మూడో సారి కలిసి పనిచేశాను. ఆయనంటే అంతిష్టం. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే బలమైన కారణం ఆయన. నాకు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. నా ప్రతి ఇష్టాన్ని త్రివిక్రమ్గారు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఎంత చేసినా, ఎంత పేరు తెచ్చుకున్నా అది త్రివిక్రమ్గారి వల్లే. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే” అని చెప్పాడు.