పెండింగ్ జీతాలు వారంలో చెల్లిస్తామని మంత్రి హామీ
హైదరాబాద్, వెలుగు: వేతన బకాయిల కోసం 4 రోజులుగా సమ్మె చేస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లతో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శనివారం చర్చలు జరిపారు. వారం రోజుల్లో బకాయిలన్నీ క్లియర్ చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నామని డాక్టర్లు ప్రకటించారు. తమ డిమాండ్లు అన్నింటికీ మంత్రి అంగీకరించారని ప్రకటనలో తెలిపారు. నిరుడు మే నెలకు సంబంధించిన వేతనాలను చెల్లించేందుకు కూడా మంత్రి ఓకే చెప్పారని పేర్కొన్నారు.
500 దాటిన కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు ఐదు వందలు దాటినయి. శనివారం 26,976 మందికి టెస్టులు చేస్తే.. 516 పాజిటివ్గా వచ్చాయి. హైదరాబాద్లో 261 మందికి, మేడ్చల్లో 43, రంగారెడ్డిలో 43, మంచిర్యాల్లో 34, సంగారెడ్డిలో 24, కొత్తగూడెంలో 15 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో పది కంటే తక్కువ చొప్పున కేసులు నమోదయ్యాయని పేర్కొంది. కేసులు పెరుగుతున్నందున అందరూ అలర్ట్ గా ఉండాలని, మాస్క్ ధరించాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు.