పాప్ ప్రపంచాన్ని తన స్వరంతో, డాన్స్ మూమెంట్స్తో ఊపేసిన షకీరా (Shakira) భారత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. 2026లో ఇండియా టూర్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘Waka Waka’, ‘Hips Don’t Lie’ వంటి సూపర్ హిట్ పాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన షకీరా, ఏప్రిల్ నెలలో ముంబై, ఢిల్లీ నగరాల్లో లైవ్ కాన్సర్ట్లతో సందడి చేయనున్నారు.
అధికారిక ప్రకటన
ఈ టూర్ను District by Zomato తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. “షకీరా షకీరా.. స్వరం. కదలికలు.. తరాలను నిర్వచించిన గీతాలు” అంటూ పోస్టు చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. అయితే టికెట్ల విక్రయాల వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ముంబై, ఢిల్లీ షోస్.. తేదీలు, వేదికలు..
షకీరా ఏప్రిల్ 10, 2026న ముంబైలోని మహాలక్ష్మి రిసోర్సెస్ లో ప్రదర్శన ఇవ్వనున్నారు. తర్వాత ఏప్రిల్ 15, 2026న న్యూ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండో కాన్సర్ట్ నిర్వహించనున్నారు.
ఇది షకీరా భారతదేశంలో దాదాపు 19 సంవత్సరాల తర్వాత చేస్తున్న భారీ ఈవెంట్. అందువల్ల ఈ షోస్ కి భారీ పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. చివరిసారిగా 2007లో ముంబైలో ఆమె చేసిన షో అభిమానుల్ని మంత్రముగ్ధులను చేసింది. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్ మెంట్ భారీ భద్రతల మధ్య షోస్ నిర్వహించనున్నారు.
ఇండియాలో ప్రదర్శన ఎప్పుడూ ప్రత్యేకమే..
తన ఇండియా టూర్ పై షకీరా మాట్లాడుతూ, “ ఇండియాలో ప్రదర్శన ఇవ్వడం ఎప్పుడూ నాకు ప్రత్యేకమే. ముంబై, ఢిల్లీలో నా అభిమానులను మళ్లీ కలవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని తెలిపారు. ఈ టూర్ లక్ష్యం కేవలం సంగీతమే కాకుండా, ప్రతి చిన్నారికి సరైన పోషకాహారం అందేలా చేయాలనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్లడమని ఆమె వెల్లడించారు.
Feeding India భాగస్వామ్యం
ఈ కాన్సర్ట్లు Feeding India అనే లాభాపేక్షలేని సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఈసారి మొదటిసారిగా ఈ కార్యక్రమం బహుళ నగరాల్లో జరుగుతుండటం ప్రత్యేకత. మొత్తానికి, 2026 ఏప్రిల్లో షకీరా ఇండియా టూర్ సంగీత ప్రియులకు మరచిపోలేని అనుభవంగా నిలవనుందని చెప్పవచ్చు.
