కాలేజీ యువతిని కిడ్నాప్ చేసి రెండేళ్లుగా అత్యాచారం

కాలేజీ యువతిని కిడ్నాప్ చేసి రెండేళ్లుగా అత్యాచారం

రాజస్థాన్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలేజీకి వెళ్తున్న యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో తీసి బెదిరిస్తూ.. గత రెండు సంవత్సరాలుగా పలుమార్లు అత్యాచారం చేశారు. అల్వార్‌కు చెందిన 20 ఏళ్ల యువతి ఏప్రిల్ 2019లో కాలేజీలో పరీక్ష రాయడానికి వెళ్తున్నప్పుడు.. వికాస్ మరియు భురు జాట్ అనే ఇద్దరు వ్యక్తులు అల్వార్‌లోని ఎస్‌ఎమ్‌డి సర్కిల్ నుంచి కిడ్నాప్ చేశారు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం యువతి అల్వార్‌లోని మలఖేరా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు కదా కనీసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

అయితే అత్యాచారం జరిగిన సమయంలో నిందితులు వీడియో తీశారు. ఆ వీడియో చూపించి.. యువతిని బెదిరిస్తూ గత రెండేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా జూన్ 25, 2021న గౌతమ్ సైనీ అనే వ్యక్తి.. యువతికి వీడియో పంపించి.. తనను కలవకపోతే వీడియో కుటుంబసభ్యులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే యువతి అతన్ని కలవకపోవడంతో.. వీడియోను సైనీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దాంతో బాధితురాలు జూన్ 28న పోలీసు సూపరింటెండెంట్ తేజస్విని గౌతమ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అల్వార్ జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయబడింది.

యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితులు వికాస్ మరియు భురు జాట్‌లను అరెస్టు చేశారు. అదేవిధంగా.. యువతిని వీడియో చూపించి బెదిరించిన మూడవ నిందితుడు గౌతమ్ సైనిని కూడా అరెస్టు చేశారు. కాగా.. బాధితురాలి ఫిర్యాదును నమోదుచేయనందుకు పోలీసుల నిర్లక్ష్యంపై కూడా దర్యాప్తు చేస్తామని.. వారు దోషులుగా తేలితే పోలీసు సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అల్వార్ సర్కిల్ అధికారి అమిత్ సింగ్ పేర్కొన్నారు.