హైదరాబాద్, వెలుగు: అమెజాన్ కంపెనీ హైదరాబాద్లో తన డేటా సెంటర్ ను విస్తరించేందుకు ఆసక్తి చూపింది. ఇందుకోసం అవసరమైన పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్బాబుతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధి బృందం సమావేశమైంది.
తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్తో పాటు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచనలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అమెజాన్తో చర్చలు విజయవంతమయ్యాయని ప్రకటించారు.
ప్రభుత్వం తరఫున తగినంత సహకారంతోపాటు ఉత్తమమైన ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ విస్తరణకు కంపెనీ ముందుకు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్.. హైదరాబాద్లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై ఆనందం వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధికి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని కెర్రీ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని తెలిపారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ యాక్టివీటిస్ను విస్తరించింది.
ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్లో ఉంది. నిరుడు అమెజాన్ డెడికేటేడ్ ఎయిర్ కార్గో నెట్వర్క్ ‘అమెజాన్ ఎయిర్’ను ప్రారంభించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు సంబంధించి హైదరాబాద్ లో మూడు డేటా సెంటర్లు పనిచేస్తున్నాయి.
