హైదరాబాద్ కు రాయుడు గుడ్ బై

హైదరాబాద్ కు రాయుడు గుడ్ బై

హైదరాబాద్‌‌, వెలుగు: చెత్తాటతో పాటు పరిపాలన వైఫల్యంతో పాతాళానికి దిగజారిన హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహమ్మద్‌‌ అజరుద్దీన్‌‌ సారథ్యంలోని హెచ్‌‌సీఏ డర్టీ పాలిటిక్స్‌‌తో విసిగిన టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు హైదరాబాద్‌‌ టీమ్‌‌ను వదిలేస్తున్నాడు. అతను మరోసారి పొరుగు రాష్ట్రం ఆంధ్రకు ట్రాన్స్‌‌ఫర్‌‌ అయ్యాడు. కొత్త సీజన్‌‌లో అంబటి ఆంధ్ర టీమ్‌‌కు ఆడతాడని, ఈ మేరకు  అతనికి ఎన్‌‌వోసీ ఇచ్చినట్టు హెచ్‌‌సీఏ సెక్రటరీ విజయానంద్‌‌ ధ్రువీకరించాడు. దాంతో, జనవరి 10వ తేదీ నుంచి జరిగే సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టోర్నమెంట్‌‌లో ఆంధ్ర టీమ్‌‌ సెలెక్షన్‌‌కు అంబటి అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో ఆంధ్ర క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (ఏసీఏ) నుంచి  కూడా అఫీషియల్‌‌ అనౌన్స్‌‌మెంట్‌‌ వచ్చే అవకాశం ఉంది. 35 ఏళ్ల రాయుడు  హెచ్‌‌సీఏను వీడి ఆంధ్రకు ఆడడం ఇది రెండోసారి. 2005–06 సీజన్‌‌లో అతను ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత బరోడా, విదర్భ జట్లకు ఆడిన రాయుడు.. 2017–18 సీజన్‌‌లో తిరిగి హైదరాబాద్‌‌ టీమ్‌‌లో చేరాడు. ఇక, సీనియర్​ పేసర్​ ఎమ్ రవికిరణ్​ కూడా స్టేట్​ టీమ్​ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్​లో అతను ఛత్తీస్​గడ్​కు ఆడాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. 29 ఏళ్ల రవికిరణ్​.. 46 ఫస్ట్​ క్లాస్​ మ్యాచ్​ల్లో 149 వికెట్లు తీశాడు. రాయుడితో పాటు అతను దూరమైతే  కొత్త సీజన్​లో  హైదరాబాద్‌‌కు తీరని నష్టం కానుంది.

వలస బాటలో స్టార్‌‌ ప్లేయర్లు

ఆటగాడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న అజర్‌‌ పాలనలో హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ ఖ్యాతి మసకబారుతోంది. దాంతో, టాలెంటెడ్‌‌ ప్లేయర్లు హైదరాబాద్‌‌ను వదిలేస్తున్నారు. ఇతర రాష్ట్రాల జట్లకు వలసపోతున్నారు.  ఈ సీజన్‌‌ ఐపీఎల్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ టీమ్‌‌కు ఎంపికైన ఆల్‌‌రౌండర్‌‌ బావనక సందీప్‌‌.. సెప్టెంబర్‌‌లో గోవాకు ట్రాన్స్‌‌ఫర్‌‌ అయ్యాడు. ఎంతో ప్రతిభ ఉన్న అతని పట్ల సీనియర్‌‌ కోచ్‌‌, సెలెక్టర్లు కఠినంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. హెచ్‌‌సీఏ పెద్దల లాబీయింగ్‌‌కు తలొగ్గి  టాలెంట్‌‌, ఎక్స్‌‌పీరియన్స్‌‌ రెండూ ఉన్నా కూడా అతనికి  తుది జట్టులో చోటు ప్రశ్నార్థకం చేశారు. దాంతో, స్టేట్‌‌ టీమ్‌‌కు కెప్టెన్‌‌ కాగలడని భావించిన 28 ఏళ్ల సందీప్‌‌.. హైదరాబాద్‌‌కు గుడ్‌‌బై చెప్పాల్సి వచ్చింది. అంతకుముందే హనుమ విహారి ఆంధ్ర టీమ్‌‌కు ట్రాన్స్‌‌ఫర్‌‌ అవ్వగా, ఇంకో సీనియర్‌‌ ఆటగాడు డీబీ రవితేజ కూడా హైదరాబాద్‌‌ను వీడాడు.  ఇప్పుడు  రాయుడు లాంటి ప్లేయర్‌‌ను మరోసారి వదులుకోవాల్సి రావడం, రవికిరణ్​ కూడా దూరం అవడంహెచ్‌‌సీఏకు ఇబ్బందికర విషయమే. ఈ పరిణామాలతో  హైదరాబాద్‌‌కు ఆడితే తమకు ఫ్యూచర్‌‌ లేదన్న భయం ఇతర సీనియర్లతో పాటు యువ ప్లేయర్లలో రెట్టింపవుతోంది. పైగా,  హైదరాబాద్‌‌ను వీడిన తర్వాతే రాయుడు, విహారి నేషనల్‌‌ టీమ్‌‌కు ఎంపికవడం గమనార్హం. ఈ సీజన్​లోనే మరికొందరు ప్లేయర్లు కూడా హైదరాబాద్​ను వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అజర్‌‌తో విభేదాలే కారణమా?

గత డొమెస్టిక్‌‌ సీజన్‌‌లో హైదరాబాద్‌‌ చెత్తగా ఆడడంతో పాటు ప్రెసిడెంట్‌‌ అజరుద్దీన్‌‌ తన  పట్ల వ్యవహరించిన తీరుతో నొచ్చుకునే అంబటి.. హెచ్‌‌సీఏను వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రిటైర్మెంట్‌‌ను పక్కనబెట్టి మరీ రాయుడు గత సీజన్‌‌లో విజయ్‌‌ హజారే,  ముస్తాక్‌‌ అలీ టీ20 టోర్నీల్లో హైదరాబాద్‌‌కు కెప్టెన్‌‌గా వ్యవహరించాడు. ఆ రెండు టోర్నీల్లో జట్టు ఓ మోస్తరుగా ఆడింది. అనంతరం హెచ్‌‌సీఏలో అవినీతితో  టీమ్‌‌లో చాలా పాలిటిక్స్‌‌ జరుగుతున్నాయని, డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లనే సెలెక్ట్‌‌ చేస్తున్నారన్న విషయాలను బయటపెట్టాడు.  అర్జున్‌‌ యాదవ్‌‌కు సీనియర్‌‌ టీమ్‌‌ కోచ్‌‌గా కొనసాగే అర్హతే లేదన్నాడు. పరిస్థితి ఇలానే ఉంటే టీమ్‌‌కు, ప్లేయర్లకే చాలా నష్టం అన్నాడు.  ఈ విషయాలను అజర్‌‌కు చెప్పినా పట్టించుకోకపోవడంతో రాయుడు రంజీలకు దూరంగా ఉన్నాడు. అంబటి ఊహించినట్టే ఆ ట్రోఫీలో హైదరాబాద్‌‌ దారుణంగా ఆడింది. అయితే, రాయుడు బయటపెట్టిన సమస్యలు పరిష్కరించని అజర్‌‌ తిరిగి అతనిపైనే ఎదురుదాడి చేశాడు.  అప్పటి నుంచి అజర్‌‌, రాయుడికి అస్సలు పడడం లేదని హెచ్‌‌సీఏ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో అంబటిని కెప్టెన్‌‌గా కొనసాగించేందుకు కూడా అజర్‌‌ సుముఖంగా లేడని తెలుస్తోంది. అతను స్టేట్‌‌ టీమ్‌‌లో ఉండడం అజర్‌‌కు ఇష్టం లేదని  హెచ్‌‌సీఏ అధికారి ఒకరు చెప్పారు. వాస్తవానికి గత రంజీ సీజన్‌‌లోనే రాయుడు హైదరాబాద్‌‌ను వీడాలని భావించాడని, తాము నచ్చజెప్పడంతో  ఇప్పటిదాకా ఉన్నాడని తెలిపారు.

అంతా గందరగోళం

ముస్తాక్‌‌ అలీ టోర్నీతో కొత్త సీజన్‌‌ను స్టార్ట్‌‌ చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించడంతో హెచ్‌‌సీఏలో కదలిక వచ్చింది. బుధవారం నుంచి త్రీడే లీగ్‌‌ నిర్వహిస్తున్నట్టు సెక్రటరీ విజయానంద్‌‌ ప్రకటించాడు. అయితే  టీ20 ఫార్మాట్‌‌ అయిన ముస్తాక్‌‌ అలీకి ముందు త్రీ డే లీగ్‌‌ ప్లాన్‌‌ చేయడం చర్చనీయాంశమైంది. ఇంకోవైపు  తాము టీ20 మ్యాచ్‌‌లు నిర్వహిస్తామని అజర్‌‌ బీసీసీఐకి లెటర్‌‌ రాశాడు. కానీ, హెచ్‌‌సీఏ రాజ్యాంగానికి లోబడే  త్రీడే లీగ్‌‌ నిర్వహిస్తున్నామని సెక్రటరీ చెప్పాడు.  ఈ లీగ్‌‌లో 22 జట్లు పోటీ పడతాయన్నాడు. ఈ సారి కంబైన్డ్‌‌ డిస్ట్రిక్ట్‌‌ ఎలెవన్‌‌ టీమ్‌‌, సెంట్రల్‌‌ ఎక్సైజ్‌‌ టీమ్‌‌లను కొత్తగా యాడ్‌‌ చేసినట్టు తెలిపారు. ఈ లీగ్‌‌ను  రెండు, మూడు రౌండ్లు మాత్రమే నిర్వహిస్తామన్నాడు. తర్వాత టీ20 మ్యాచ్‌‌లు ఆడిస్తామని చెప్పాడు. వాస్తవానికి గత నెలలోనే త్రీ డే లీగ్‌‌  స్టార్ట్‌‌  చేద్దామని అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మెంబర్స్‌‌ ఎంత చెప్పినా అజర్‌‌ ససేమిరా అన్నాడు. ఇక, అతను ప్రెసిడెంట్‌‌ అయి ఏడాది పూర్తయినా ఇప్పటిదాకా క్రికెట్‌‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని ఏర్పాటు చేయలేదు. సీనియర్‌‌ టీమ్ సెలెక్టర్లను సీఏసీనే ఎంపిక చేస్తుంది.  ఈ సీజన్‌‌కు సెలెక్టర్లతో పాటు కోచ్‌‌ను కూడా నియమించాల్సి ఉంది. అయితే,  సీఏసీ నియామకం జరగాలంటే ఏజీఎం నిర్వహించాల్సిందే.  కానీ, ఏజీఎం నిర్వహణకు పర్మిషన్‌‌ ఇవ్వొద్దంటూ రాచకొండ సీపీకి అజర్​ లేఖ రాశాడు. ఇలా అజర్‌‌ పాలనలో హెచ్‌‌సీఏలో అన్ని విషయాల్లో గందరగోళం ఏర్పడింది. ఇక,  అన్ని స్టేట్‌‌ అసోసియేషన్లు క్రికెట్‌‌ రీస్టార్ట్‌‌ విషయంలో తలమునకలై ఉన్న ఈ టైమ్‌‌లో అజర్‌‌ ఢిల్లీ  వెళ్లడం గమనార్హం.