ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా 

ఖమ్మం కార్పొరేషన్/రూరల్, వెలుగు: 12 మంది దళితులను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత బీజేపీదేనని దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా అన్నారు. శనివారం బీజెపీ జిల్లా ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ వాజ్​పేయి హయాంలో అంబేద్కర్​ ఫొటోను పార్లమెంట్​లో పెట్టడంతో పాటు భారతరత్నతో సత్కరించినట్లు తెలిపారు. నలుగురు గవర్నర్లు, రాష్ట్రపతి పదవికి సైతం దళితులను ఎంపిక చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్​ సెక్రటేరియేట్​కు అంబేద్కర్​ పేరు పెట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. దళితబంధు పేరుతో చిచ్చుపెడుతున్నారని, దళితులను టీఆర్ఎస్​ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, భూపాలపల్లి జిల్లా ఇన్​చార్జి నన్నె ఉదయ్​ప్రతాప్, ఖమ్మం పార్లమెంట్​ కన్వీనర్​ నంబూరి రామలింగేశ్వరరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి విజయ్​రాజు, సుదర్శన్, శ్యాం రాథోడ్, నున్నా రవికుమార్, రుద్రప్రదీప్, జ్వాలా నర్సంహారావు, ఎర్నేని రామారావు, ఉపేందర్​, వీరస్వామి పాల్గొన్నారు. అనంతరం ఎస్సీ కాలనీల సందర్శనలో భాగంగా ఖ మ్మం రూరల్​ మండలం ముత్తగూడెం ఎస్సీ కాలనీలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డితో కలసి పర్యటించారు. బీజేపీ మండల అధ్యక్షుడు బట్టు నాగరాజు, జిల్లా కార్యదర్శి వీరభద్రం వారి వెంట ఉన్నారు.

పోలీస్​ పోర్టల్​ను ప్రారంభించిన డీజీపీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీస్​ పోర్టల్​ను డీజీపీ మహేందర్​రెడ్డి హైదరాబాద్​లోని తన ఆఫీస్​లో శనివారం ప్రారంభించారు. కొత్తగూడెం వన్​టౌన్​ పోలీస్​ స్టేషన్​లో హెడ్ కానిస్టేబుల్​గా పని చేస్తున్న ఘని కొడుకు రషీద్​ ఎస్పీ డాక్టర్​ వినీత్​ ఆదేశాలతో ఈ పోర్టల్​ను రూపొందించారు. రషీద్​ సాఫ్ట్​వేర్​​ ఇంజనీర్​గా పని చేస్తూనే జిల్లా పోలీస్​ పోర్టల్​ను రూపొందించడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ <https://www.bhadradrikothagudempolice.in> లింక్​ ద్వారా జిల్లా పోలీస్​ శాఖకు చెందిన పూర్తి సమాచారం శనివారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. ఈ పోర్టల్​ ద్వారా ప్రజలు ఆన్​లైన్​ ద్వారా కంప్లైట్​ చేయవచ్చని తెలిపారు. జిల్లాలోని పోలీస్​ స్టేషన్లలో తప్పిపోయిన వారి వివరాలు, గుర్తు తెలియని మృత దేహాలు, మావోయిస్టులు, పోలీస్​ రిక్రూట్​మెంట్​ వంటి వివరాలు ఉంటాయని చెప్పారు.పాస్​పోర్టు సేవలతో పాటు జిల్లా పోలీసుల సోషల్​ మీడియా ఖాతాలను లింక్​ చేసినట్లు తెలిపారు. 

కృష్ణయ్య హత్య కేసు దర్యాప్తుపై అనుమానాలు

కుటుంబ సభ్యులను పరామర్శించి బీజేపీ స్టేట్​ లీగల్​ టీమ్ 

ఖమ్మం రూరల్, వెలుగు: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసు దర్యాప్తు సరిగా జరగలేదని, పలు అనుమానాలు ఉన్నాయని బీజేపీ లీగల్​ సెల్​ కమిటీ కన్వీనర్​ అంటోని రెడ్డి ఆరోపించారు. శనివారం మండలంలోని తెల్దారుపల్లిలో టీఆర్ఎస్​ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య కుటుంబసభ్యులను లీగల్​ టీమ్​​పరామర్శించింది. ఆయన ఫొటో వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టులో లొంగిపోయిన నిందితులను పోలీసులు కస్టడీలోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కృష్ణయ్య కుటుంబ సభ్యులు స్వతంత్ర సంస్థకు కేసును అప్పగించాలని కోరుతున్నారని, సీబీఐ ఎంక్వైరీ కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. అవసమైతే సెంట్రల్​ హోం మినిస్ట్రీకి కూడా విన్నవిస్తామని చెప్పారు. నిజాలు నిగ్గుతేలేంత వరకు తాము కేసుపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి నివేదిక అందజేస్తామని చెప్పారు. కృష్ణయ్య హత్యలో రాజకీయ నేతల ప్రమేయం ఉండడంతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యానారాయణ,  శ్రీనివాస్​గౌడ్, శ్రీకాంత్​గౌడ్, డి శ్రీనివాసరావు, గడ్డం గణేశ్, కటకం శారవ, కృష్ణ, అనన్య, వనం శ్రీకాంత్  ఉన్నారు.​

సింగరేణి హెడ్​ ఆఫీస్ ముట్టడి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కాంట్రాక్ట్​కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఉద్రిక్తంగా మారింది.కొత్తగూడెం సింగరేణి హెడ్​ ఆఫీస్​ ఎదుట ధర్నా చేపట్టిన కార్మికులు ఆఫీస్​లోకి వెళ్లేందుకు యత్నించగా సింగరేణి సెక్యూరిటీ గార్డులు, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తోపులాటలో కొందరు కార్మికులు కింద పడగా, మహిళా కార్మికులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకొని పోలీస్​ స్టేషన్లకు తరలించారు. మహిళలను పోలీసులు ఈడ్చుకెళ్లారని, చేయి చేసుకున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. నాయకులు, కార్మికులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏబీకేఎంఎస్​ జాతీయ కార్యదర్శి పి.మాధవ్​ నాయక్​ పరామర్శించారు. కార్మిక సంఘాల జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, ఎర్రగాని కిష్టయ్య, పి సతీష్​, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం

ఎర్రుపాలెం, వెలుగు: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ లకు ఆహ్వాన పత్రికలను టెంపుల్ ఈవో జగన్మోహనరావు అందించారు. సోమవారం నుంచి అక్టోబర్  5 వరకు శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

500 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

అశ్వారావుపేట, వెలుగు: రెండు లారీల్లో తరలిస్తున్న 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ నుంచి ఏపీలోని కాకినాడకు 250 క్వింటాళ్లు, మిర్యాలగూడ నుంచి రాజమండ్రికి 250 క్వింటాళ్లు తరలిస్తుండగా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ సెంటర్​లో దాడి చేసి పట్టుకున్నారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు హుజూరాబాద్, మిర్యాలగూడ ట్రేడర్స్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ. 12 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి

తల్లాడ, వెలుగు: పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శనివారం మండలంలో జడ్పీటీసీ దిరిశాల ప్రమీల ఆధ్వర్యంలో కలకొడిమ, బస్వాపురం, కుర్నవల్లి, ముద్దనూరు తదితర గ్రామాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్  చెక్కులతో పాటు ఆసరా పింఛన్ కార్డులు ఎమ్మెల్యే సొంత ఖర్చులతో చీరెలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్వాపురం నుంచి పెద్ద కోరుకొండి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. డీసీఎంఎస్  చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, రైతుబంధు మండల అధ్యక్షుడు వెంకటలాల్, ఏఎంసీ వైస్  చైర్మన్  భద్రరాజు, సర్పంచులు సూరంపల్లి లక్ష్మీనారాయణ, ఐలూరి లక్ష్మి, చింతల రేణుక, శీలం కోటారెడ్డి, నాయకులు దిరిశాల దాసురావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కర్నాటి సైదిరెడ్డి పాల్గొన్నారు.

ప్లేస్ మెంట్ డ్రైవ్ లో 10 మంది సెలెక్ట్

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలోని కవిత మెమోరియల్ కాలేజీలో శనివారం జరిగిన టెక్నోజెన్  ప్లేస్ మెంట్  డ్రైవ్ కు 85 మంది హాజరు కాగా, 10 మంది ఎంపికైనట్లు కంపెనీ ప్రతినిధులు సంతోష్, రాజగోపాల్ రావు తెలిపారు. యూఎస్ ఐటి రిక్రూటర్స్  ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామకపత్రాలను అందించారు. సెలెక్ట్  అయిన వారిని కాలేజీ సెక్రటరీ, కరస్పాండెంట్ కోట అప్పిరెడ్డి అభినందించారు. అనంతరం కాలేజీలో ఎన్ఎస్ఎస్  అవతరణ దినోత్సవ వేడుకకు చీఫ్​ గెస్ట్​గా ఎన్ఎస్ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు హాజరై మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ డాక్టర్  కేవీ రమణారావు, టీపీవో పాపారావు, జగదీష్, ఎన్ఎస్ఎస్ పీవోలు వంశీ ప్రియ, లక్ష్మణ్  పాల్గొన్నారు.

దళితబంధు యూనిట్లు అమ్మితే క్రిమినల్​ కేసులు

పెనుబల్లి, వెలుగు: దళితబంధు యూనిట్లను అమ్మితే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ హెచ్చరించారు. మండలంలోని కొత్తకారాయిగూడెం గ్రామంలో 73 మంది లబ్ధిదారులకు  మంజూరైన యూనిట్లను తహసీల్దార్​ రమాదేవితో కలసి తనిఖీ చేశారు. దళితబంధు యూనిట్ల ను రెంట్ కు మాత్రమే ఇవ్వాలని ఏండ్ల తరబడి లీజ్​ అగ్రిమెంట్​ పేరుతో ఇవ్వడం నేరమని చెప్పారు. ఐదేండ్ల తరువాత యూనిట్లను అమ్ముకోవచ్చనేది అపోహ మాత్రమేనని తెలిపారు. త్వరలో యూనిట్లకు జియో ట్యాగింగ్​ చేయనున్నట్లు చెప్పారు. సర్పంచ్​ దొడ్డపునేని శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి హరీన్​ చక్రవర్తి, దొడ్డపునేని రవి పాల్గొన్నారు. 

ముంపు గ్రామాలుగా ప్రకటించాలని ఆందోళన

బూర్గంపహాడ్,వెలుగు: మండలంలోని గోదావరి ముంపు గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ అధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న జేఏసీ నాయకులు ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల గోదావరికి వరదలు రావడంతో మండల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలుగా ప్రకటించి ప్యాకేజీ అందించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం, కొత్తగూడెం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు ముందస్తుగా మోరంపల్లి బంజర్ నుంచి లక్ష్మీపురం వైపు మళ్లించారు. కేసుపాక వెంకటరమణ, దామర శ్రీను, లక్కోజు విష్ణు, పేరాల శ్రీనివాసరావు, పూలపల్లి సుధాకర్ రెడ్ది,  బత్తులవెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలి

భద్రాచలం, వెలుగు: టీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రతీ పేదవాడికి అందించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేశ్ డిమాండ్​ చేశారు. శనివారం భద్రాచలంలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి తహసీల్దార్​ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబుల్​బెడ్రూం ఇ ళ్లు, సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు, గోదావరి వరద బాధితులందరికీ పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. జిల్లా కమిటీ సభ్యుడు మర్లపాటి రేణుక, సున్నం గంగ, బండారు శరత్​బాబు, సంతోష్​కుమార్, లీలావతి, సీతాలక్ష్మీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

రామయ్యకు సువర్ణ తులసీదళార్చన

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళార్చన నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలతో అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం రామపాదుకలకు భద్రుని మండపంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత గర్భగుడిలో మూలవరులకు సువర్ణ తులసీదళ అర్చన జరిగింది. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. ఎండోమెంట్​ అడిషనల్​ కమిషనర్​ జ్యోతి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చాక ఈవో శివాజీ ప్రసాదం, మెమోంటోను అందజేశారు. అలాగే పాల్వంచలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని అడిషనల్ కమిషనర్  జ్యోతి దర్శించుకొని పూజలు నిర్వహించారు.