- బెంగళూరులో డిజైన్ సెంటర్ను పెడతామన్న కంపెనీ
- 2.5 ఏళ్లలో వేదాంత చిప్ ప్లాంట్ అందుబాటులోకి
- చిప్ల తయారీకి రెడీగా ఫాక్స్కాన్ ..
గాంధీనగర్: యూఎస్ కంపెనీ అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) ఇండియాలో 400 మిలియన్ డాలర్లు (రూ.3,300 కోట్లు ) ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో ఈ పెట్టుబడులు పెడతామని, బెంగళూరులో అతిపెద్ద డిజైన్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. గాంధీనగర్లో జరుగుతున్న సెమికండక్టర్ కాన్ఫరెన్స్లో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పేపర్మాస్టర్ ఈ ప్రకటన చేశారు. ఈ సెంటర్ను 5 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేయనుండగా, సుమారు 3 వేల మంది ఇంజినీర్లకు ఉద్యోగాలు రానున్నాయి. ఇదే ఈవెంట్లో పాల్గొన్న వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ కూడా తన సెమీకండక్టర్ బిజినెస్పై ప్రకటన చేశారు. ఇంకో రెండున్నరేళ్లలో వేదాంత చిప్ల తయారీ ప్లాంట్ రెడీ అవుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, చిప్ల తయారీ కోసం ఫాక్స్కాన్తో కలిసి వేదాంత జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయాలని చూసిన విషయం తెలిసిందే. కానీ, ఈ జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్కాన్ బయటకు వచ్చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సెమీకండక్టర్ ప్రొడక్షన్ ప్లాన్ కింద సపరేట్గా అప్లయ్ చేస్తామని ఫాక్స్కాన్ ప్రకటించింది. పార్టనర్ కోసం చూస్తున్న వేదాంత , ఈ ఏడాది చివరిలోపు చిప్ల తయారీలోకి ఎంటర్ అవుతామని పేర్కొంది.
సెమీకండక్టర్లకు అనువుగా...
సెమీకండక్టర్ల తయారీకి ఇండియాలో పరిస్థితులు ‘చాలా ధైర్యంగా’ ఉన్నాయని ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లీ వ్యాఖ్యానించారు. ప్రతీ కంపెనీ ముందుకెళ్లే కొద్దీ బలంగా తయారవుతుందని అభిప్రాయపడ్డారు. వేదాంత జాయింట్ వెంచర్పై ఆయన ఏం మాట్లాడలేదు. కాగా, చిప్ల కోసం తైవాన్, చైనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు, లోకల్గా ప్రొడక్షన్ పెంచేందుకు ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల విలువైన రాయితీలను కంపెనీలకు ఇవ్వడానికి ముందుకొచ్చింది. మరోవైపు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చిన మైక్రాన్ తమ ఇన్వెస్ట్మెంట్స్తో 5 వేల మందికి జాబ్స్ వస్తాయని పేర్కొంది. డీఆర్ఎం, ఎన్ఏఎన్డీ ప్రొడక్ట్లను గుజరాత్ ప్లాంట్లో ఫినిష్డ్ ప్రొడక్ట్స్గా మారుస్తామని వెల్లడించింది. మైక్రాన్ రూ.6,760 కోట్లను ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సాయం కింద రూ.22,540 కోట్లను అందించనుంది.