
భారత్ ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగాన్ని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మరోసారి సమర్థించింది. భవిష్యత్తులో అంతరిక్ష ముప్పు పొంచి ఉందన్న ఆందోళనతోనే భారత్ ఏశాట్ ప్రయోగం చేపట్టిందని తెలిపింది. అంతరిక్షం నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం కోసమే భారత్ ఈ ప్రయోగం చేసిందన్నారు అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ కమాండర్ జనరల్ హైటెన్ . అంతరిక్షంలో వ్యవహరించాల్సిన తీరుపై కొన్ని నిబంధనలు కూడా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతరిక్ష శకలాలపై ఆందోళన వక్తమవుతున్నందున.. వాటి నిర్వహణపైనా కఠిన చట్టాలు రూపొందించాల్సి ఉందన్నారు హైటెన్.
మార్చి 27న మిషన్ శక్తి పేరిట భారత్ ఏశాట్ ప్రయోగం నిర్వహించింది. 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపగ్రహాన్ని ధ్వంసం చేసింది. ఈ సామర్థ్యం కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఏశాట్ ప్రయోగంపై ఆందోళన వ్యక్తం చేసింది నాసా. ఏశాట్ శకలాలతో ఐఎస్ ఎస్ కు ముప్పు ఉందని వాదించింది. అయితే త్వరలోనే శకలాలు అదృశ్యమవుతాయని భారత నిపుణులు చెప్పగా.. పెంటగాన్ కూడా సమర్థించింది. తాజాగా భారత్ ప్రయోగాన్ని సమర్ధిస్తూ ప్రకటన చేసింది పెంటగాన్.