
మేఘాలయ: ఇండోర్ హనీమూన్ జంట కేసు ఊహించని మలుపు తిరిగింది. మేఘాలయకు హనీమూన్కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేసింది అతని భార్యనేనని పోలీసుల విచారణలో తేలింది. ఊహించని ఈ ట్విస్ట్తో ఇరు కుటుంబాలు కంగుతిన్నాయి. ఈ విషయాన్ని మేఘాలయ డీజీపీ ఇదాషిషా నోంగ్రాంగ్ మీడియాకు వెల్లడించారు. రాజా రఘువంశీని చంపేందుకు అతని భార్య సోనమ్ కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చిందని డీజీపీ తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్లోని నంద్గంజ్ పోలీస్ స్టేషన్లో సోనమ్ సరెండర్ అయింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హంతకుల్లో ఒకరిని యూపీలో అరెస్ట్ చేయగా, మిగిలిన ఇద్దరినీ ఇండోర్లో అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో మరికొంత మంది కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అసలు ఈ హత్య కేసు ఎక్కడ మొదలైందంటే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేస్తుంది.
మే 11న రఘువంశీ, సోనమ్ వివాహం ఇండోర్లో ఘనంగా జరిగింది. మే 20న ఈ జంట హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లింది. మే 23న మేఘాలయలోని షిపారాలో హోటల్ చెక్ ఔట్ చేసిన రఘువంశీ, సోనమ్ కనిపించకుండాపోయారు. మే 24న సోహ్రారిమ్ గ్రామ సమీపంలో ఈ జంట వాడిన స్కూటీ కనిపించింది. ఆ స్కూటీని సోనమ్, రఘువంశీ రెంట్కు తీసుకున్నారని మే 25న పోలీసులు తేల్చారు.
జూన్ 2న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా ప్రాంతంలో ఒక జలపాతం సమీపంలోని లోతైన లోయలో రఘువంశీ డెడ్ బాడీని కుళ్లిన స్థితిలో పోలీసులు గుర్తించారు. జూన్ 7న పోలీసులు ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ యూపీ, మధ్యప్రదేశ్ లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. జూన్ 8న ఘాజీపూర్లో ఒక దాబా దగ్గర సోనమ్ కనిపించింది. జూన్ 9న నంద్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఆమె లొంగిపోయింది. పోలీసులు ఆమెను విచారించగా.. భర్త హత్యకు కర్త, కర్మ, క్రియ సోనమ్ అని తేలింది.