
హ్యూస్టన్: అమెరికాలోని టెక్సస్ లో నిర్వహించిన కౌన్సిల్ ఎన్నికల్లో ఇద్దరు ఇండియన్ అమెరికన్లు విజయం సాధించారు. షుగర్ ల్యాండ్ లోని డిస్ట్రిక్ట్ 2 కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో సహచర ఇండియన్ అమెరికన్ నాసిర్ హుస్సేన్ పై సంజయ్ సింఘాల్ భారీ విజయం నమోదు చేశారు. సింఘాల్ కు 2,346 ఓట్లురాగా.. నాసిర్ కు 777 ఓట్లు వచ్చాయి. అలాగే సాన్ ఆంటోనియాలోని డిస్ట్రిక్ 1 కౌన్సిల్ సీటుకు జరిగిన ఎన్నికల్లో మరో ఇండియన్ అమెరికన్ సుఖ్ కౌర్ తన ప్రత్యర్థి ప్యాటీ గిబన్స్ పై గెలుపొందారు.
గిబన్స్ కు 35 శాతం ఓట్లు పోలవగా.. కౌర్ కు 65 శాతం ఓట్లు వచ్చాయని ఫోర్ట్ బెండ్ కౌంటీ అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓటర్లకు సంజయ్ సింఘాల్, సుఖ్ కౌర్ కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని సింఘాల్ అన్నారు. పారదర్శక పాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.