కదలని రుతుపవనాలు.. ఇప్పట్లో వాన లేనట్టేనా..? వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..

కదలని రుతుపవనాలు.. ఇప్పట్లో వాన లేనట్టేనా..? వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..
  • ప్రారంభంలోనే భారీ వర్షాలు పడడంతో తేమంతా ఖాళీ
  • అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే మళ్లీ యాక్టివ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎంత తొందరగా ప్రవేశించాయో.. ఇప్పుడు అంతే స్తబ్ధుగా మారిపోయాయి. పది రోజులుగా రుతుపవనాల్లో కదలిక అన్నదే లేకుండా పోయింది. మే 24న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించగా.. ఆ తర్వాత రెండు రోజులకే తెలంగాణ అంతటా విస్తరించాయి. అంటే మే 26 నాటికి రుతుపవనాలు రాష్ట్రమంతటా వ్యాపించాయి. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకూ విస్తరించాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలో పూర్తిగా, మహారాష్ట్ర, చత్తీస్​గఢ్​, ఒడిశా రాష్ట్రాల్లో సగం ప్రాంతాల వరకు విస్తరించిన రుతుపవనాలు.. ఈశాన్య రాష్ట్రాల్లోనూ పూర్తిగా విస్తరించాయి. అయితే, మే 29 నుంచి మందకొడిగా ముందుకు కదులుతున్నాయి. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కొత్త ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించలేదని భారత వాతావరణ శాఖ డేటా స్పష్టం చేస్తున్నది. అయితే, రుతుపవనాలు ఎంటరయ్యాక మధ్యలో బ్రేక్​ తీసుకోవడం సహజమేనని అధికారులు చెబుతున్నారు. ఈసారి బ్రేక్​ సుదీర్ఘంగా ఉందంటున్నారు.

వర్షాలూ పడట్లే..
నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా లేకపోవడంతో రాష్ట్రంలో వర్షాలూ ఎక్కువగా పడడం లేదు. అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడుతున్నా భారీ వర్షాల జాడ అయితే లేదు. వాస్తవానికి ఈ ఏడాది మేలోనే పశ్చిమ తీరం (అరేబియా సముద్రం)తో పాటు తూర్పు తీరం (బంగాళాఖాతం)లోనూ వాయుగుండాలు ఏర్పడడంతో రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలాయని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ప్రారంభంలోనే భారీ వర్షాలు పడ్డాయని పేర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే వాతావరణంలోని తేమంతా వర్షాల రూపంలో వెళ్లిపోయిందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. రుతుపవనాలు మళ్లీ యాక్టివ్​ కావాలంటే అరేబియాలో గానీ, బంగాళాఖాతంలో గానీ అల్పపీడనంగానీ లేదా వాయుగండం లాంటి సిస్టమ్​ డెవలప్​ కావాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అలాంటి అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. మరో నాలుగైదు రోజుల్లో రెండువైపులా సిస్టమ్​ డెవలప్​ అయ్యేందుకు అవకాశాలున్నాయని, అయితే, ఎంతవరకు అది సాధ్యమవుతుందో రెండు రోజుల్లో తేలుతుందని తెలిపారు. 

మేలో ఫుల్ రెయిన్స్​..
మేలో మన రాష్ట్రంతో పాటు దేశంలో వర్షాలు జోరుగా పడినట్టు ఐఎండీ వెల్లడించింది. మే నెలకు సంబంధించిన వాతావరణ పరిస్థితులపై తాజాగా నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా మే నెలలో 106 శాతం అధిక వర్షాలు పడ్డాయని తెలిపింది. మామూలుగా అయితే 61.4 మిల్లీమీటర్ల వర్షపాతం మేలో పడాల్సి ఉంటే.. ఈ ఏడాది మేలో 126.7 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ అధికవర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. 71.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. 199.7 మిల్లీమీటర్ల వర్షపాతం దక్షిణాదిలో నమోదైనట్టు తెలిపింది. ఇది 178.2 శాతం అధికమని వివరించింది. 1901 నుంచి ఇది రెండో అత్యధిక వర్షపాతమని తెలిపింది.

ఇక, తెలంగాణలోనూ 135.8 మిల్లీమీటర్ల వర్షపాతం మేలో నమోదైనట్టు తెలిపింది. మేలో కురవాల్సిన సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇది 161 శాతం అధికమని ఐఎండీ తెలిపింది. మరోవైపు రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు వర్షపాతంలో తీవ్రమైన లోటు ఏర్పడింది. కేవలం ములుగు, మహబూబాబాద్​, జనగామ, యాదాద్రి, మేడ్చల్​ మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాల్లోనే వర్షపాతం లోటు తక్కువగా ఉంది. కాగా, రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది.