
- గోల్కొండ మహంకాళి ఆలయం నుంచి స్టార్ట్
- రూ.20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలు బోనాల పండుగకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 26 నుంచి ఆషాఢ బోనాల వేడుకలు ప్రారంభమై నెలరోజుల పాటు జరగనున్నాయి. తొలుత గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనం సమర్పిస్తారు. హైదరాబాద్లో 28 ప్రముఖ ఆలయాలు ఉండగా.. వీటి పరిధిలో బోనాలు నిర్వహించనున్నారు. ఆయా ఆలయాల్లో పూజా కార్యక్రమాలకు హాజరయ్యే అతిథుల వివరాలను ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్లు లిస్ట్ అవుట్ చేశారు. అంతేకాకుండా, గతంలో జరిగిన పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.
ఆలయాలకు వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. చలువ పందిళ్లు వేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. బోనం సమర్పణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ ఇబ్బందులపై రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై అధికారులకు ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఒకటిరెండ్రోజుల్లో ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది.
బల్కంపేట ఎలమ్మ ఆలయంలో జులై 1న
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జులై 1వ తేదీన బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, 20, 21 తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహినీ మహంకాళి ఆలయంలో, నాచారంలోని మహంకాళి సమేత మహంకాళేశ్వర ఆలయంలో బోనాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
ఏర్పాట్లకు 20 కోట్లు మంజూరు
ఆషాఢ బోనాల ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయాలకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. గ్రేడ్లను బట్టి ఆలయాలకు దేవాదాయశాఖ ఫండ్స్రిలీజ్ చేసింది. బోనాల వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.