
వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తీరుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి మండిపడ్డారు. ఆ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ప్రమోషన్లు ఇస్తారని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పని చేస్తే సంకెళ్లు వేస్తారని ఫైర్ అయ్యారు. పాక్పై దౌత్యయుద్ధంలో భాగంగా శశిథరూర్ ఆధ్వర్యంలోని డెలిగేషన్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నది. ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనేందుకు అమెరికాకు సాయం చేసిన డాక్టర్ షకీల్ అఫ్రీదిని పాకిస్తాన్ జైల్లో పెట్టగా, ఆయనను విడుదల చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మాన్ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. దీనికి శశిథరూర్ స్పందిస్తూ.. ‘‘బ్రాడ్ షెర్మాన్ డిమాండ్ను నేను స్వాగతిస్తున్నాను.
కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, అతణ్ని అమెరికాకు పట్టించినందుకు డాక్టర్ అఫ్రీదిని అరెస్టు చేసి చిత్రహింసలు పెడుతున్నది. పాక్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ప్రమోషన్లు ఇస్తారు. అదే ఉగ్రవాదులను పట్టిస్తే శిక్షిస్తారు” అని మండిపడ్డారు. కాగా, పాకిస్తాన్కు చెందిన డాక్టర్ షకీల్ అఫ్రీది.. అల్ఖైదా లీడర్ ఒసామా బిన్ లాడెన్ను చంపేందుకు యూఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కి సాయం చేశారు.
మహాత్ముడికి నివాళి..
అమెరికాలో పర్యటస్తున్న శశిథరూర్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం.. వాషింగ్టన్లోని ఇండియన్ ఎంబసీ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించింది. ‘‘మేం పర్యటిస్తున్న అన్ని దేశాల్లో మహాత్ముడికి నివాళి అర్పిస్తున్నాం. అలాగే అమెరికాలోనూ చేశాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల రాజధానుల్లో మహాత్మాగాంధీ విగ్రహాలు ఉన్నాయి. శాంతి, అహింస, స్వేచ్ఛకు ఆయన ప్రతిరూపం” అని కొనియాడారు.
కాగా, అమెరికా డిఫ్యూటీ ఫారిన్ మినిస్టర్ క్రిస్టోఫర్ లాండౌతో శశిథరూర్ బృందం సమావేశమైంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి ఆయనకు వివరించింది. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో శశిథరూర్ పోస్టు పెట్టారు.