శాఖ కేటాయింపుపై కుండబద్ధలు కొట్టిన మంత్రి వివేక్ వెంకటస్వామి

శాఖ కేటాయింపుపై కుండబద్ధలు కొట్టిన మంత్రి వివేక్ వెంకటస్వామి

న్యూఢిల్లీ: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హస్తినలో బిజీబిజీగా గడిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబంతో కలిసి వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేను కలిశారు. కేసీ వేణుగోపాల్ను కూడా మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియాతో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు.

ఖాళీగా ఉన్న మరో 3 మంత్రి పదవుల్లో సామజిక న్యాయాన్ని పార్టీ పాటిస్తుందని, ఓసీ, ఇతర సామాజిక వర్గాల ఆశావహులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం అమలు చేయాలని రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్ తనకు సూచించారని తెలిపారు.

ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని, లోకల్ బాడీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు తీసుకోచ్చేందుకు అందరూ పనిచేయాలని సూచించారని చెప్పారు. ఖర్గేకు తెలంగాణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని, ఐక్యంగా పనిచేసి పార్టీని ప్రజలకు చేరువ చేయాలని ఆయన తనకు దిశానిర్దేశం చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.

శాఖ కేటాయింపు సీఎం నిర్ణయం మేరకు ఉంటుందని, ఏది ఇచ్చినా మంచిగా పనిచేస్తానని చెప్పారు. ప్రభుత్వానికి మంచిపేరు తీసుకోచ్చేలా తన పని తీరు ఉంటుందని, ఏ శాఖ కేటాయించిన తన తండ్రి కాకా సమర్థవంతంగా నిర్వహించడమే కాక ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారని, తన తండ్రి అడుగుజాడల్లోనే పనిచేస్తానని వివేక్ వెంకటస్వామి మాటిచ్చారు.