హైదరాబాద్, వెలుగు: డీఎస్పీ (కేటగిరీ–2) నియామకాలు, ఇంటర్సే సీనియారిటీ వివాదంపై జులై 28లోగా స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చామని, ఇకపై వాయిదాలకు అవకాశం లేదని స్పష్టం చేసింది. జీవో నెం.123లోని నిబంధనలను సవాల్ చేస్తూ 64 మంది డీఎస్పీలు దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారించింది.
జీవో–123 ప్రకారం పరీక్ష, శిక్షణ మార్కులకు వెయిటేజీ ఇచ్చి సీనియారిటీ నిర్ణయించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వం ఇంకా అంశాన్ని పరిశీలిస్తున్నందున మరింత సమయం కావాలని కోరగా, ఆగస్టులో శిక్షణ పూర్తికానున్న నేపథ్యంలో ఆలస్యం పిటిషనర్లకు నష్టం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది. ప్రభుత్వానికి తుది అవకాశం ఇస్తూ తదుపరి విచారణను జులై 28కు వాయిదా వేసింది.
