-has-revealed-that-the-corona-is-spread-through-the-air_HZUWhsRiBp.jpg)
న్యూఢిల్లీ: గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని, మనుషులు శ్వాస విడుదల చేసే టైమ్లో వెలువడే అతి సూక్ష్మ కణాల ద్వారా వ్యాప్తి చెందుతుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి 3 నుంచి 6 అడుగులలోపు వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో 6 అడుగుల కంటే కాస్త ఎక్కువ దూరం వ్యాప్తికి అవకాశం ఉంటుందని చెప్పింది. ఈ మేరకు తాజాగా గైడ్లైన్స్ జారీ చేసింది. గాలి ద్వారా కరోనా సోకుతుందని లాన్సెంట్ వెల్లడించిన నెల తర్వాత సీడీసీ ఈ ప్రకటన చేసింది. వైరస్ వ్యాప్తిని 3 రకాలుగా సీడీసీ వర్గీకరించింది. అతి చిన్న శ్వాస కోస కణాలను నేరుగా పీల్చడం వల్ల, ఆరోగ్యవంతమైన వ్యక్తి ముక్కు, నోరు వంటి శ్లేష్మ పొరలపై వైరస్ కణాలు చేరడం వల్ల, వైరస్తో కలుషితమైన ప్రదేశాలను చేతులతో తాకి ఆ తర్వాత మన మ్యూకస్ పొరలను ఆ చేతితో తాకడం వలన వైరస్ సంక్రమించొచ్చని చెప్పింది.
వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో..
మాట్లాడటం, పాడటం, ఎక్సర్సయిజ్ చేయడం, దగ్గడం, చీదడం, శ్వాసక్రియ వల్ల బయటకు వచ్చే చిన్న నీటి బిందువుల ద్వారా వైరస్ గాలిలో చేరుతుందని సీడీసీ వివరించింది. వైరస్ సోకిన వ్యక్తుల నుంచి కాస్త పెద్ద పరిమాణంలో విడుదలయ్యే డ్రాప్లెట్స్ సెకన్ల నుంచి నిమిషాల వ్యవధిలోనే నేలపై పడిపోతాయని చెప్పింది. కానీ అత్యంత స్వల్ప పరిమాణంలోని కణాలు మాత్రం కొన్ని నిమిషాల పాటు గాలిలోనే ఉంటాయంది. అవి గాలిలో ఎంత టైమ్ ఉంటాయనేది ఆ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. వైరస్ సోకిన వ్యక్తుల నుంచి దూరంగా ఉన్నప్ప్పుడు వైరస్ వ్యాప్తి ప్రమాదం తగ్గుతుందంది. 6 అడుగుల కన్నా ఎక్కువ దూరం ఉంటే ముప్పు తక్కువని వివరించింది. వైరస్ సోకిన వ్యక్తి గాలి బయటకు వెళ్లలేని ప్రాంతాల్లో 15 నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు ఉంటే ఆ ప్రాంతంలో వైరస్ కణాలు ఎక్కువగా ఉంటాయని.. అలాంటప్పుడు వ్యాప్తి 6 అడుగుల కన్నా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక కొన్ని కేసుల్లో వైరస్ సోకిన వ్యక్తి వెళ్లిన మార్గంలో వెంటనే వెళ్లిన వాళ్లలో వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుందని చెప్పింది.
మాస్కు, ఫిజికల్ డిస్టెన్స్ చాలా ముఖ్యం
గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని తేలినందున మాస్కులు పెట్టుకోవడం, 6 అడుగుల దూరం పాటించడం, సరిపడ వెంటిలేషన్ ఉండేటట్లు చూసుకోవడం, గుంపులుగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉంటే కరోనా వ్యాప్తి తగ్గుతుందని సీడీసీ చెప్పింది. వ్యక్తిగత శుభ్రత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యమని తెలిపింది.