కేంద్రమంత్రి అమిత్ షా హైదరాబాద్ టూర్ లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఎయిర్పోర్ట్ టు చేవెళ్ల సభకు కాకుండా శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్కు వెళ్లారు అమిత్ షా.. అక్కడ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చిస్తున్నారు. వాస్తవానికి అమిత్ షా షెడ్యూల్లో ఈ సమావేశం లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన రోడ్డు మార్గాన చేవెళ్లకు వెళ్లి అక్కడ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ సడన్ గా ఆయన నోవాటెల్ హోటల్ లో పార్టీ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సమావేశం అనంతరం నోవాటెల్ హోటల్ నుంచి చేవెళ్లలో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభకు అమిత్ షా బయలుదేరనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమయం దగ్గర పడుతోన్న సందర్భంలో అమిత్ షా ఈ సభలో ఏం మాట్లాడనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అమిత్ షా.. తాము కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సభ అనంతరం అమిత్ షా నేరుగా రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. కాగా ఈ సభను రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.