న్యూఢిల్లీ : దాణ, రవాణా వంటి ఖర్చులను తట్టుకోవడానికి ప్రముఖ పాల సప్లయర్లు అమూల్, మదర్ డెయిరీ బుధవారం నుంచి పాల ధరలను లీటరుకు రూ.రెండు చొప్పున పెంచుతున్నట్టు ప్రకటించాయి. గడచిన ఆరు నెలల్లో అమూల్, మదర్ డెయిరీకి ఇది రెండవ పెంపు. ఈ ఏడాది మార్చిలోనూ ఈ రెండు సంస్థలు పాల ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచాయి. అమూల్ బ్రాండ్తో పాలు, ఇతర పాల ఉత్పత్తులను అమ్ముతున్న గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) మంగళవారం గుజరాత్, ఢిల్లీ-–ఎన్సీఆర్, వెస్ట్లోని అహ్మదాబాద్ సౌరాష్ట్రలో పాల ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచాలని నిర్ణయించింది. బెంగాల్, ముంబై, ఇతర మార్కెట్లలో కొత్త ధరలు ఆగస్టు 17 నుంచి అమలులోకి వస్తాయి. లీటరుకు రూ. 2 పెంపు సగటు ఆహార ఇన్ఫ్లేషన్ కంటే తక్కువేనని అమూల్ ఒక ప్రకటనలో తెలిపింది. పోయిన సంవత్సరంతో పోలిస్తే పశువుల దాణా ఖర్చు సుమారు 20 శాతంపెరిగిందని పేర్కొంది.
పాలు, పాల ఉత్పత్తుల కోసం బయర్లు చెల్లించే ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలను అమూల్ పాల ఉత్పత్తిదారులకు చెల్లిస్తుంది. ఇక నుంచి అమూల్ ఫుల్ క్రీమ్ మిల్క్ అహ్మదాబాద్, కోల్కతా, ఢిల్లీ-ఎన్సిఆర్ ముంబైలలో లీటరుకు రూ. 62లకు లభిస్తుందని, టోన్డ్ మిల్క్ అహ్మదాబాద్లో రూ.50లకు, మిగిలిన మూడు మార్కెట్లలో రూ.52లకు అమ్ముతామని అమూల్ తెలిపింది. అమూల్ డబుల్ టోన్డ్ మిల్క్ ధర అహ్మదాబాద్లో రూ.44కి, కోల్కతా, ఢిల్లీ-ఎన్సీఆర్లలో లీటరుకు రూ.46కి పెరిగింది. జీసీఎంఎంఎఫ్ రోజుకు 150 లక్షల లీటర్లకుపైగా పాలను అమ్ముతుంది. ఢిల్లీ–-ఎన్సిఆర్లో పాల ధరలను లీటరుకు బుధవారం నుంచి రూ.2 చొప్పున పెంచనున్నట్లు మదర్ డెయిరీ ప్రకటించింది. ఇది ఇక్కడ రోజుకు 30 లక్షల లీటర్ల కంటే ఎక్కువ పాలు అమ్ముతుంది. దీంతో ఫుల్ క్రీమ్ మిల్క్ ధర బుధవారం నుంచి రూ.59 నుంచి రూ.61లకు పెరిగింది. టోన్డ్ మిల్క్ ధరలు రూ.51కి పెరగనుండగా, డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.45కు పెరగనుంది. ఆవు పాల ధర లీటరుకు రూ.53కి పెరిగింది. బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) ధరను లీటరుకు రూ.46 నుంచి రూ.48కి పెంచింది.