భూమిలో బంగారం పండుతుందని రైతులు సరదాగా మాట్లాడుకుంటుంటారు. కానీ భూములు బంగారమయ్యాయని ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ లో భూముల విలువ బంగారాన్ని మించి పెరిగిపోయి రికార్డు సృష్టిస్తున్నాయి. కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో కోట్లు పలుకుతున్నాయి. శుక్రవారం (నవంబర్ 28) నిర్వహించిన ఈ వేలంలో కోకాపేట నియోపోలీస్ భూములు రికార్డు స్థాయి ధర పలికాయి. రెండో విడత వేలంలో ఎకరాకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. 151 కోట్ల రూపాయలు పలికి HMDA కోట్లు కురిపించాయి.
హైదరాబాద్ కోకాపేట్ లో ఉన్న భూముల రెండో విడత ఈ-వేలం శుక్రవారం ముగిసింది. నియోపోలిస్ దగ్గర ఉన్న ప్లాట్ నెంబర్ 15 లో ఎకరానికి 151 కోట్ల 25 లక్షలు పలికిన ఎకరం ధర పలికి రికార్డు సృష్టించింది. అదే విధంగా ప్లాట్ నెంబర్ 16 లో ఎకరం ధర 147 కోట్ల 75 లక్షలు పలికింది.
రెండో విడత వేలంలో భాగంగా 9.06 ఎకరాల భూమిని వేలం వేసిన HMDA .. 1,3 కోట్ల 52 లక్షల ఆదాయాన్ని పొందింది. ప్లాట్ నెంబర్ 15 లో 4.03 ఎకరాలకు గాను 609 కోట్ల 55 లక్షలు పొందినట్లు HMDA అధికారులు తెలిపారు. అదే విధంగా ప్లాట్ నెంబర్ 16 లో 5.03 ఎకరాలకు గాను 743 కోట్లు పొందినట్లు పేర్కొన్నారు.
2025, నవంబర్ 25న జరిగిన మొదటి విడత వేలంలో రికార్డు స్థాయిలో ఎకరానికి 137.25 కోట్లు పలికిన సంగతి తెలిసిందే.. కోకాపేట నియోపోలిస్ లో 29 ఎకరాలతో పాటు మూసాపేట దగ్గర ఉన్న 16 ఎకరాల భూములకు వేలం వేసేందుకు సిద్దమైంది హెచ్ఎండీఏ.డిసెంబర్ 3, 5 తేదీల్లో మిగతా ప్లాట్లకు ఈ వేలం జరగనుంది. కోకాపేట్ నియోపోలీస్ ప్లాట్లకు ఎకరానికి 99 కోట్లు, కోకాపేట గోల్డెన్ మైల్ ప్లాట్లకు 70 కోట్లు, మూసాపేట్ ప్లాట్ల కు 75 కోట్ల చొప్పున ప్రారంభ ధరను నిర్ణయించింది హెచ్ఎండీఏ.
కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ఆకాశమే హద్దుగా ఎన్ని ఫ్లోర్లయినా నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తారు. ఈ లేఅవుట్లో అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. దాదాపు 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.40 ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇందులో సైక్లింగ్ట్రాక్స్, 45 మీ. వెడల్పైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలను కల్పించారు. అలాగే కమర్షియల్, రెసిడెన్సీ, ఎంటర్టైన్మెంట్ల అవసరాలకు భవనాలు నిర్మించుకునేందుకు అనుమతించనున్నారు.
