శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఇటీవల హిందూ కుటుంబాలపై టెర్రరిస్టులు దాడి చేసిన నేపథ్యంలో మరిన్ని బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాశ్మీర్కు అదనంగా 20 కంపెనీల పారామిలటరీ బలగాలను పంపుతామని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్) ప్రకటించింది. 1,800 మందితో కూడిన ఈ బలగాలను ఎక్కువగా పూంఛ్, రాజౌరీ జిల్లాలో మోహరిస్తామని తెలిపింది.
రాజౌరీలోని డాంగ్రి గ్రామంలో ఈ నెల 1న ఉగ్రవాదులు పౌరులపై జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే అదే జిల్లాలోని మరో గ్రామంలో టెర్రరిస్టులు అమర్చిన మందుపాతర పేలి చిన్నారి సహా ఇద్దరు మరణించారు. దీంతో టెర్రరిస్టుల ఆచూకీ కోసం గత మూడు రోజులుగా భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి.