
- లక్ష నుంచి 5 లక్షలకు పెరిగిన ప్రయాణికులు
- రద్దీగా కంపార్ట్మెంట్లు.. కిక్కిరిసిపోతున్న ఉమెన్స్ స్పెషల్ బోగీలు
- బోగీల సంఖ్య పెంచాలని ప్యాసింజర్ల నుంచి విజ్ఞప్తులు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ మెట్రో రైళ్లలో రోజురోజుకు రద్దీ పెరుగుతున్నది. ఒకప్పుడు రోజూ లక్ష మంది ప్రయాణించగా, ఇప్పుడు రోజూ సగటున 5 లక్షల మంది దాకా ప్రయాణిస్తున్నారు. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో బోగీల్లో నిలబడడానికి కూడా జాగ దొరకడం లేదు. ఇలా నిత్యం రద్దీతో మెట్రో నడుస్తుంటే, ఫ్రీ బస్సు వల్ల ఆదరణ తగ్గుతోందంటూ బయట ప్రచారం జరుగుతున్నది. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమని మెట్రోఉద్యోగులు, ప్రయాణికులు అంటున్నారు. గతంతో పోలిస్తే మెట్రోలో రష్ ఇంకా ఎక్కువైందని, అసలు బోగీలలో ఖాళీనే ఉండడం లేదని చెబుతున్నారు. మహిళల కోసం కేటాయించిన ఉమెన్స్ స్పెషల్ బోగీలైతే కిక్కిరిసిపోతున్నాయని, జనరల్ బోగీల్లోనూ మహిళలే పెద్ద సంఖ్యలో ఉంటున్నారని పేర్కొంటున్నారు. ఉమెన్స్ స్పెషల్ బోగీలతో పాటు జనరల్ బోగీల సంఖ్యను కూడా పెంచాలని కోరుతున్నారు. ‘‘ఢిల్లీలో కొన్నేండ్లుగా మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలవుతున్నది. అక్కడ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదు. అసలు ఇప్పటి వరకు అక్కడ అలాంటి చర్చనే జరగలేదు. మన దగ్గర మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ను డిసెంబర్లో ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి మెట్రోపై ఎలాంటి ప్రభావం పడలేదు. ప్రయాణికుల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదు” అని చెబుతున్నారు.
మన మెట్రోకు మరింత గిరాకీ పెరిగే అవకాశం ఉందని, అయితే డిమాండ్కు తగ్గట్టు బోగీల సంఖ్యను పెంచాలని ఐటీ ఎంప్లాయ్స్ అంటున్నారు. ‘‘మెట్రోలో వెళ్లాలని ఉన్నప్పటికీ, పీక్ హవర్స్లో రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో ఆఫీస్ క్యాబ్ లను ఆశ్రయిస్తున్నాం. రద్దీకి అనుగుణంగా అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని ఇదివరకే మెట్రో అధికారులకు లేఖలు కూడా రాశాం. సోషల్ మీడియాలో కూడా మె ట్రోకు మెసేజ్లు పంపించాం” అని చెబుతున్నారు.
ఫ్రీ బస్ స్కీమ్ తో లాభమే..
రాష్ట్ర సర్కార్ ప్రారంభించిన ఫ్రీ బస్ స్కీమ్తో మెట్రోకు లాభమే జరిగింది తప్ప, నష్టం జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వివిధ పనుల మీద హైదరాబాద్కు వస్తున్న మహిళలు.. ఫ్రీ బస్ ద్వారా తమకు మిగిలిన కొంత మొత్తాన్ని వెచ్చించి మెట్రోలో ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాల నుంచి సిటీలో ఉన్న ప్రధాన బస్ స్టేషన్ల వరకు బస్సులో వచ్చి , అక్కడి నుంచి సిటీలోని తమ గమ్య స్థానాలను చేరుకోవడానికి మెట్రోను ఆశ్రయిస్తున్నారు. విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీ నగర్ వద్ద, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు జేబీఎస్ స్టేషన్ వద్ద, ఎంజీబీఎస్ స్టేషన్ వద్ద, వరంగల్ నుంచి వచ్చిన వాళ్లు నాగోల్ వద్ద మెట్రో ఎక్కి తమ గమ్య స్థానాలకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని తాము గమనించామని మెట్రో ఉద్యోగులు కూడా చెబుతున్నారు. మెట్రో రద్దీ అంశంపై మెట్రోలో పనిచేసే ఓ ఉద్యోగి ‘వెలుగు’తో మాట్లాడారు. ఉచిత బస్సు స్కీమ్తో ప్రయాణికుల సంఖ్య తగ్గిందన్న వాదనను ఆయన ఖండించారు. ‘‘ఫ్రీ బస్ స్కీమ్ తర్వాత మెట్రోలో ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, సాధారణ మహిళల సంఖ్య పెరిగింది. ఇంటి వద్ద నుంచి మెట్రో వరకు ఆటోలో వచ్చి, ఇక్కడి నుంచి మెట్రోకు వెళ్లడానికి ఎక్కువ డబ్బులు అవుతాయన్న కారణంతో గతంలో క్యాబ్లో వెళ్లిన మహిళలు.. ఇప్పుడు ఉచిత బస్సును ఉపయోగించుకుని మెట్రో స్టేషన్ వరకు వచ్చి మెట్రోలో తమ గమ్య స్థానాలకు వెళ్తున్నారు. తద్వారా వారికి ఆటో చార్జీలు మిగులుతున్నాయి. క్యాబ్ కంటే తక్కువ డబ్బులతో మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు” అని చెప్పారు.
ఇప్పటి వరకు 50 కోట్ల మంది జర్నీ..
హైదరాబాద్ మెట్రోను నవంబర్ 2017లో ప్రారంభించారు. తొలుత అమీర్పేట్ నుంచి మియాపూర్ వరకు ట్రైన్స్ నడిపారు. 2019 నవంబర్ నాటికి అన్ని రూట్లలో మెట్రో ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. మొదట్లో రోజూ సగటున లక్ష మంది, ఆ తర్వాత 2 లక్షల మంది ప్రయాణిస్తే.. 2020 నాటికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. అనంతరం కరోనా కారణంగా మెట్రో ప్రయాణికుల సంఖ్య దారుణంగా పడిపోయింది. రకరకాల ఆంక్షలు ఉండడం, క్లోజ్డ్ డోర్స్ జర్నీ కావడంతో ప్రయాణికులు మెట్రోలో ఎక్కడానికి భయపడ్డారు. ఆ సమయంలో అన్ని రకాల రవాణా వ్యవస్థపై ఇలాంటి ప్రభావమే పడింది. మళ్లీ కరోనా ఆంక్షలన్నీ తొలగిపోయాక, మెట్రోకు మునుపటి కంటే ఎక్కువగా గిరాకీ పెరిగింది. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రోజూ 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ నాటికి 50 కోట్ల మంది ప్రయాణించినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అమీర్పేట్ మెట్రో స్టేషన్లో వేడుకలు కూడా నిర్వహించారు. అత్యంత తక్కువ కాలంలోనే మెట్రో మంచి ఆదరణ పొందిందని ఆయన అన్నారు.
మెట్రోలో మస్తు రష్ ఉంటున్నది..
మేం ఆఫీస్కు ఇన్టైమ్లో వెళ్లాలి. అందుకే ఫ్రీ బస్ స్కీమ్ ఉన్నా మెట్రోనే ప్రిఫర్ చేస్తున్నాం. కానీ మెట్రోలో రద్దీ కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం మెట్రోలో మస్తు రష్ ఉంటోంది. వుమెన్స్ స్పెషల్ బోగీలో ప్లేస్ దొరక్క జనరల్ బోగీల్లో ఎక్కుతున్నాం. వాటిల్లో కూడా చాలా రష్ ఉంటోంది. బోగీల సంఖ్య పెంచాలని మెట్రోకు ట్వీట్ చేశాం. కానీ రెస్పాన్స్ లేదు. మెట్రో సర్వీసులైనా పెంచాలి.. మహిళల బోగీలైనా పెంచాలి. - అను, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్