30వ అంతస్తు నుంచి..11వ ఫ్లోర్ లో పడి కార్మికుడు మృతి

30వ అంతస్తు నుంచి..11వ ఫ్లోర్ లో పడి కార్మికుడు మృతి
  •     లింగంపల్లిలోని కేఎల్ సీ నిర్మాణ సంస్థలో ఘటన
  •     సేఫ్టీ పట్టించుకోలేదని తోటి కార్మికులు ఆందోళన 
  •     కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు

చందానగర్, వెలుగు :  ప్రమాదశాత్తూ అపార్ట్​మెంట్​పై నుంచి పడి కార్మికుడు మృతిచెందిన  ఘటన చందానగర్​ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వెస్ట్ ​బెంగాల్​కు చెందిన  ఖైరుల్​మియా(32)కు భార్య, ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం తన మామతో కలిసి 15 రోజుల కిందట సిటీకి వచ్చి లింగంపల్లిలోని కాండ్యూర్ ​క్రెసెంట్​కేఎల్​సీ నిర్మాణ సంస్థలో  కూలీగా చేరాడు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో  ఖైరుల్ మియా అపార్ట్ మెంట్30వ అంతస్తులో పని చేస్తూ ప్రమాదవశాత్తు 11వ ఫ్లోర్​లో పడిపోయాడు. 

అతడికి తీవ్రగాయాలై స్పాట్ లో చనిపోయాడు. దీంతో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతోనే  ఖైరుల్ మియా మృతిచెందాడని తోటి కార్మికులు ఆందోళన చేపట్టారు. సంస్థ ఆఫీస్​ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులతో నిర్మాణ సంస్థ బందోబస్తు పెట్టింది.  కేఎల్​సీ నిర్మాణ సంస్థ సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడంతోనే  ఖైరుల్ మియా చనిపోయినట్టు అతని మామ మాటియూర్ ​మండోల్​చందానగర్ ​పోలీసులకు కంప్లయింట్ చేయగా సదరు నిర్మాణ సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టినట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.