
బషీర్బాగ్, వెలుగు: నకిలీ ట్రేడింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఓ వృద్ధుడు భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. యూసుఫ్ గూడ ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల వృద్ధుడు రెండు వేర్వేరు ఆన్లైన్ ట్రేడింగ్ యాప్స్ లో పెట్టుబడి చేశాడు. సెబీ ఆమోదంతో నడుస్తున్న యాప్స్ అని స్కామర్స్ నమ్మించారు.
ఫైయర్స్పైజ్ యాప్ లో రూ.71.75 లక్షలు ఇన్వెస్ట్ చేయగా.. రూ.4.78 కోట్లు లాభం చూపించారు. ఎస్ఎంసీఏఎస్ఈ యాప్ లో రూ.14.66 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.5.56 లక్షలు లాభం చూపించారు. విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా 30 శాతం లాభాన్ని చెల్లించాలని స్కామర్స్ అడిగారు. నిరాకరించడంతో యాప్స్ యాక్సెస్ ను బ్లాక్ చేశారు. మొత్తం రూ.86 లక్షలు పోగొట్టుకున్నాక సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశారు.
ఫేక్ అరెస్ట్ వారెంట్ పంపి 32 లక్షలు..
ఫేక్ అరెస్టు వారెంట్ పంపించి ఓ రిటైర్డ్ ఉద్యోగి వద్ద స్కామర్స్ రూ.32 లక్షలు కొట్టేశారు. సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. లాలగూడా ప్రాంతానికి చెందిన 83 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి స్కామర్స్ జూన్ 23న ఫోన్ చేశారు. ఆయన వివరాలు సేకరించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరిట నకిలీ అరెస్ట్ వారెంట్ ను పంపించారు.
మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ఈడీ , పోలీస్ అధికారులుగా నమ్మిస్తూ భయపెట్టారు. ఆయనతో పాటు భార్యను అరెస్ట్ చేసి ముంబై కు తరలిస్తామని హెచ్చరించారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో వృద్ధుడు పలు దఫాలుగా రూ.32 లక్షల 2 వేలు పంపించాడు. ఆ తరువాత మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.