హయత్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం
ఎల్బీనగర్, వెలుగు: పెండ్లయిన కొన్నిగంటల్లోనే ఆ ఇంట్లో విషాదం నిండింది. కొడుకు వివాహం జరిపి ఆనందంతో వస్తున్న తండ్రి రోడ్డు యాక్సిడెంట్లో దుర్మరణం పొందాడు. ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక(1గంట) జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన నల్లబోలు వెంకట్ రెడ్డి(55) రైతు. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి హయత్ నగర్ కు చెందిన యువతితో శనివారం కోదాడలో పెండ్లి చేశారు. అనంతరం పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు బయలుదేరారు. హయత్ నగర్ సమీపంలోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద వీరి కారు పంక్చర్ అయ్యింది. టైర్ మార్చేందుకు కొంత సామాగ్రి అవసరపడింది. దీంతో వెంకటరెడ్డి సమీపంలోని షాపుకు వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వస్తున్న గుర్తుతెలియని వెహికల్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. హయత్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.