
తిరుపతి: పురుషులకు సిరి సంపదల కోసం ఏటా భాద్రపద మాసంలో నిర్వహించే అనంత పద్మనాభ వ్రతాన్ని ఇవాళ సంప్రదాయబద్దంగా ఏకాంతంతా నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని పురస్కరించుకుని ముందుగా శాస్ర్తోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. సాధారణంగా శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు తీసుకుని వచ్చారు. అభిషేకం అనంతరం చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ. అయితే కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు ఆలయ అర్చకులు.
ఒక గంగాళంలో పవిత్రజలాన్ని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శన చక్రాన్ని ముంచి చక్రస్నానం చేయించారు .ప్రతి సంవత్సరం బాధ్రపదమాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంతపద్మనాభస్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మహిళల సౌభాగ్యం కోసం వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారో, పురుషులకు సిరి సంపదల కోసం అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహిస్తారు. పాల సముద్రంలో శేషశయ్య మీద పవళించి ఉండే దివ్యమంగళ స్వరూపమే అనంత పద్మనాభుడు. ఈ వ్రతంలో భూభారాన్ని మోస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.