సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం మరో 3 నెలల పొడిగింపు

సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం మరో 3 నెలల పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం మరో మూడు నెలల పాటు పొడిగించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్‌ ప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్‌లో సీఎస్ నీలం సాహ్ని పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, ఆమె పదవీ కాలాన్ని జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకూ మూడు నెలల కాలం పెంచుతూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 30వ తేదీన సీఎస్‌గా నీలం సాహ్ని పదవీ కాలం ముగియనుండడంతో మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ సీఎస్ పదవీ కాలం పొడిగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్‌ప్రకాశ్ పేర్కొన్నారు.