కొండపై నుంచి దూకేసిన కొడుకు.. కాపాడే క్రమంలో తండ్రి కూడా.. భర్త, కొడుకుకు కళ్ల ముందే ఇలా జరగడంతో..

కొండపై నుంచి దూకేసిన కొడుకు.. కాపాడే క్రమంలో తండ్రి కూడా.. భర్త, కొడుకుకు కళ్ల ముందే ఇలా జరగడంతో..

పూణే: ఛత్రపతి సంభాజీనగర్‌లోని తిస్‌గావ్ ప్రాంతంలో ఉన్న ఖావ్‌డ్యా డోంగర్ దగ్గర శుక్రవారం విషాదకర ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. 18 ఏళ్ల యువకుడు కొండ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడగా, అతనిని కాపాడే ప్రయత్నంలో ఆ కుర్రాడి తల్లిదండ్రులు కూడా కింద పడి మరణించారు. చనిపోయిన ముగ్గురినీ18 ఏళ్ల కునాల్ మురళీధర్ చంద్వాడే, అతని తండ్రి మురళీధర్ చంద్వాడే, తల్లి సంగీత చంద్వాడేగా గుర్తించారు. ఈ కుటుంబం దేవ్‌లై-సతారా ప్రాంతానికి చెందినదిగా పోలీసులు తెలిపారు.

కునాల్ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఖావ్‌డ్యా కొండ వద్దకు చేరుకుని, ఎత్తు నుంచి దూకి తన ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అతని తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు కూడా అక్కడ గుమిగూడి అతనిని అడ్డుకునే చనిపోవద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు, రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకున్నారు.

అందరూ కలిసి సుమారు మూడు నాలుగు గంటల పాటు కునాల్‌ను చనిపోవాలనే నిర్ణయం విరమించుకునేలా ఒప్పించడానికి ప్రయత్నించారు. సురక్షితంగా తిరిగి రావాలని అతని తండ్రి పదేపదే బతిమలాడాడు. అయినప్పటికీ కునాల్ ఎవరు ఎంత చెప్పినా ఎవరి మాటలను పట్టించుకోలేదు. కొండ అంచున నిలబడి చచ్చిపోతానని చివరికి అన్నంత పని చేశాడు.

ఒకానొక దశలో.. మురళీధర్ తన కొడుకును పట్టుకునే ప్రయత్నంలో అతని వైపు వెళ్లాడు.  ఆయన కునాల్‌కు దగ్గరగా వెళ్లాడు. కానీ కునాల్ ఇంతలోనే కొండ పై నుంచి దూకేశాడు. అతనిని కాపాడే ప్రయత్నంలో మురళీధర్ కూడా బ్యాలెన్స్ కోల్పోయి, తన కొడుకుతో పాటు లోయలో పడిపోయారు. కింద పడటం వల్ల ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు.

కళ్ల ముందే భర్త, కొడుకును కోల్పోవడంతో సంగీత తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. బాధతో ఆమె కూడా కొండ పైనుంచి దూకి మరణించింది. కుటుంబం మొత్తం ఇలా కొండపై నుంచి కింద పడి చనిపోవడంతో అక్కడ ఉన్న వాళ్లంతా షాక్లోకి వెళ్లిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.