అంగన్వాడీ సెంటర్లలో అద్దె లొల్లి!.. 600కు పైగా అద్దె ఇండ్లలోనే కొనసాగింపు

అంగన్వాడీ సెంటర్లలో అద్దె లొల్లి!..  600కు పైగా అద్దె ఇండ్లలోనే కొనసాగింపు
  • ఆర్నెళ్లుగా ఆగిన చెల్లింపులు.. 
  • కేంద్రాలకు తాళాలు వేస్తామంటున్న యజమానులు 
  • సర్దిచెప్పేందుకు సతమతమవుతున్న టీచర్లు 
  • ఇతర సమస్యలతోనూ పెరుగుతున్న ఒత్తిడి 
  • మెనూ చార్జీలు పెంచలే.. ఎగ్​ బిర్యాని పెట్టమంటున్నారని ఆవేదన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్​వాడీ సెంటర్ల పరిస్థితి ఆగమాగం ఉంది. ఆర్నెళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో సెంటర్ల యజమానులు తాళాలు వేస్తామంటూ తరుచూ బెదిరిస్తున్నారు. వారికి సర్దిచెప్పేందుకు టీచర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.మరో వైపు సెంటర్లకు వచ్చే చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు వారానికి రెండు రోజులు ఎగ్​ బిర్యాని పెట్టాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ మెనూ చార్జీలు పెంచకపోవడంతో తమ పర్సులోంచి  ఖర్చు  చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. 

600కు పైగా అద్దె ఇండ్లలోనే... 

జిల్లాలో 2,061 అంగన్​వాడీ సెంటర్లున్నాయి. ఇందులో 600కుపైగా అద్దె ఇండ్లలోనే కొనసాగుతున్నాయి. రూరల్​ప్రాంతాల్లో రూ. 1,500 నుంచి రూ. 2వేల వరకు, అర్బన్​ ప్రాంతాల్లో రూ. 3,500 నుంచి రూ. 4వేల వరకు అద్దె చెల్లిస్తోంది. కాగా, గత ఆర్నెళ్లుగా ప్రభుత్వం నుంచి బిల్లులు రిలీజ్​ కాకపోవడంతో ఇండ్ల యజమానులు టీచర్లపై అద్దె కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల కొత్తగూడెం పట్టణం బూడిదగడ్డ ఏరియాలో, చిట్టి రామవరంలో అద్దె కట్టకపోతే సెంటర్​కు తాళం వేస్తామని యజమానులు లొల్లి చేశారు. దీంతో సెంటర్​ టీచర్లు వారిని బతిమిలాడుకోవాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి జిల్లాలోని చాలా చోట్ల ఉండడంతో కొందరు టీచర్లు తమ సొంత డబ్బులను చెల్లిస్తూ నెట్టుకొస్తున్నారు. 

మరోవైపు ‘బిర్యాని’ సమస్య.. 

జిల్లాలోని 11 ఐసీడీఎస్​ ప్రాజెక్టుల పరిధిలోని 2,061 అంగన్​ వాడీ సెంటర్లలో 6,337 మంది గర్భిణులు, 6,336 మంది బాలింతలు ఉన్నారు. మూడేండ్ల  నుంచి ఆరేండ్ల వరకు గల చిన్నారులు 26,998 మంది అంగన్​వాడీ సెంటర్లకు వస్తున్నారు. వీరందరికీ వారానికి రెండు రోజులు ఎగ్​ బిర్యాని పెట్టాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఇటీవల  ఆదేశాలొచ్చాయి.

 కానీ ఇందుకు సంబంధించి ఎటువంటి మెనూ చార్జీలు పెంచకపోవడంతో టీచర్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం అంగన్​వాడీ సెంటర్లకు సప్లై అవుతున్న కారం, పసుపు కూడా క్వాలిటీగా లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యలపై ఉన్నతాధికారులు స్పందించి పరిష్కరించాలని టీచర్లు  కోరుతున్నారు. 

బిల్లులు చెల్లించాలి..

ఆర్నెళ్లుగా అంగన్​వాడీకి అద్దె చెల్లించకపోవడంతో రోజురోజుకూ ఇంటి యజమాని నుంచి ఒత్తిడి పెరుగుతోంది.  బిల్లులు త్వరగా చెల్లించాలి. వారంలో రెండు రోజలు బిర్యాని పెట్టాలంటే మెనూ చార్జీలు కూడా పెంచాలి. 
- మణి, అంగన్​వాడీ టీచర్, కొత్తగూడెం

బకాయిలు రిలీజ్​ కావాల్సి ఉంది

అంగన్​వాడీ సెంటర్ల అద్దె బకాయిలు రిలీజ్​ కావాల్సి ఉంది. గతంలో ఉన్న బకాయిల్లో చాలా వరకు ప్రభుత్వం క్లియర్​ చేసింది. దశల వారీగా బిల్లులను చెల్లిస్తోంది. ఎగ్​ బిర్యానికి సంబంధించి ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకునే అవకాశాలున్నాయి. మెనూ చార్జీలు పెంచే విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. - స్వర్ణలత లెనినా, పీడీ, ఐసీడీఎస్​, భద్రాద్రికొత్తగూడెం.