
- క్రియా హెల్త్ కేర్ సంస్థ ఫౌండర్ను కిడ్నాప్ చేసిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ
- రూ.100 కోట్ల కంపెనీని వేరేటోళ్ల పేరు మీద రాయాలని చిత్రహింసలు
- బెదిరింపులకు గురిచేసి రూ.40 కోట్ల షేర్ల మార్పిడి
- బాధితుడు వేణుమాధవ్ ఫిర్యాదుతో కేసు నమోదు
- రాధాకిషన్ రావు సహా 9 మందిపై ఎఫ్ఐఆర్
జూబ్లీహిల్స్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తన బిజినెస్ పార్ట్నర్ చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తితో కలిసి రాధాకిషన్ రావు తనను కిడ్నాప్ చేశారని క్రియా హెల్త్ కేర్ సంస్థ ఫౌండర్ చెన్నుపాటి వేణుమాధవ్ ఈ నెల 8న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.100 కోట్ల విలువైన తన కంపెనీని చంద్రశేఖర్ పేరిట రాయాలని రాధాకిషన్ రావు చిత్రహింసలకు గురిచేశారని, బలవంతంగా రూ.40 కోట్ల విలువైన షేర్లను రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేణుమాధవ్ ఫిర్యాదుతో రాధాకిషన్ రావు, చంద్రశేఖర్ వేగే సహా 9 మందిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు. ‘‘నేను హార్వార్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివి వరల్డ్ బ్యాంకులో పని చేశాను. 2011లో క్రియా హెల్త్కేర్ సంస్థను ప్రారంభించాను. 2014లో ఏపీలో 165 హెల్త్కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి, ప్రభుత్వం తరఫున సేవలు అందించాను. ఖమ్మంలో టెలీ మెడిసిన్ సేవలు ప్రారంభించాను. జాతీయ రహదారులపై అత్యవసర వాహనాలు ఏర్పాటు చేశాను. ఉత్తర్ప్రదేశ్లో హెల్త్కేర్సెంటర్ల ప్రాజెక్టు నాకు వచ్చిన సమయంలో పార్ట్టైమ్ డైరెక్టర్లుగా గోపాల్, రాజ్, నవీన్, రవిని నియమించాను.
బాలాజీ అనే వ్యక్తిని కంపెనీ సీఈఓగా పెట్టాను. ఆ టైమ్ లో చంద్రశేఖర్వేగే అనే వ్యక్తి మా కంపెనీలో షేర్లు కొనుగోలు చేశాడు. అతడు డైరెక్టర్లతో కుమ్మక్కై కంపెనీ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే దానికి నేను ఒప్పుకోకపోవడంతో నన్ను కిడ్నాప్ చేశారు. 2018 మార్చి 22న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 76లోని నా ఇంటి నుంచి గోల్ఫ్కోర్టుకు వెళ్తుండగా.. నా కారు వెనుక మూడు టూవీలర్లు ఫాలో అయ్యాయి.
ఖాజాగూడలోని ఢిల్లీ పబ్లిక్స్కూల్వద్దకు చేరుకోగానే వాళ్లు నా కారును అడ్డగించి అద్దాలను ధ్వంసం చేశారు. నన్ను కారు నుంచి బయటకు లాగి కొట్టారు. అనంతరం కొంతమంది కారెక్కి నన్ను వెనుక సీటులో కూర్చోబెట్టారు. తాము టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి ఐడీ కార్డులు చూపించారు. ఉదయం 9:30 గంటల నుంచి నన్ను వాళ్ల అధీనంలో ఉంచుకుని.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు” అని ఫిర్యాదులో వేణుమాధవ్ వివరించారు.
టాస్క్ ఫోర్స్ టీమ్కు రూ.10 లక్షలు
అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఆదేశాలతో ఇన్ స్పెక్టర్గట్టు మల్లు, ఎస్సై మల్లికార్జున్ కలిసి తనను కిడ్నాప్చేశారని ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు. అనంతరం డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. ‘‘చంద్రశేఖర్చెప్పినట్టు వినాలని, లేకుంటే చంపేస్తామని వాళ్లు నన్ను బెదిరించారు. రూ.100 కోట్ల విలువైన నా కంపెనీని చంద్రశేఖర్ పేరు మీద రాయించుకునే ప్రయత్నం చేశారు. బలవంతంగా రూ.40 కోట్ల విలువైన షేర్లను రాయించుకున్నారు. ఈ విషయాన్ని మీడియా, పోలీస్ ఉన్నతాధికారులకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సీఐ గట్టు మల్లు, అతని బృందానికి రూ.10 లక్షలు ఇచ్చాను” అని ఫిర్యాదులో వేణుమాధవ్ వివరించారు. ఈ మేరకు రాధాకిషన్రావు, చంద్రశేఖర్వేగే, గట్టు మల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీపై జూబ్లీహిల్స్పోలీసులు కేసు నమోదు చేశారు.