
- పాత డిపోల్లో 120 నుంచి 130 బస్సులు
- స్థలాభావం, డిపోకు బస్సులు చేర్చడానికి అధిక సమయం
- ఆరు నెలల్లో 300 కొత్త బస్సులు
- ఓఆర్ఆర్ పరిధిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్లో కొత్తగా మరో నాలుగు బస్డిపోలను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. పెరుగుతున్న బస్సుల సంఖ్యతో పాటు ట్రాఫిక్సమస్యల వల్ల ఇప్పుడున్న డిపోలపై ఒత్తిడి పెరుగుతోందని అందుకే బస్డిపోల సంఖ్యను పెంచాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేసినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ప్రస్తుతం గ్రేటర్లో 24 బస్డిపోలుండగా, 3,043 బస్సులున్నాయి. ఒక్కో డిపోలో 120 నుంచి 130 బస్సులను ఉంచుతున్నారు. దీంతో స్థలం సరిపోవడం లేదు. సర్వీసులు పూర్తయ్యాక రాత్రి వేళ బస్సులను డిపోలకు చేర్చడానికి అధిక సమయం పడుతోంది. దీంతో పాటు మరో 6 నెలల్లో సిటీకి మరో 300 కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉండడంతో కొత్త బస్ డిపోలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో..
ఓఆర్ఆర్పరిసర ప్రాంతాల్లోనే కొత్త డిపోలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే ఈ బస్డిపోలకు100 ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడున్న బస్డిపోల్లో బస్సులను నిలపడానికి సరైన వసతులు లేవని, విశాలమైన ప్రాంగణాలు అవసరం కాబట్టి కొత్త డిపోలను ఔటర్కు దగ్గరగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా డిపోల్లో చార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయంటున్నారు.