
- జీ20 సమిట్ ముగిసే వరకు ఢిల్లీ నగరంపై యుద్ధ విమానాలు పహారా కాస్తుంటాయి. హై టెక్నాలజీ డ్రోన్లను వాడుతున్నారు. ఢిల్లీ గగనతలంపై రాఫెల్, మిరాజ్-2000, సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాలతో పహారా కాయనున్నాయి.
- లక్షా 40 వేల మంది సెక్యూరిటీ సిబ్బందితో సహా 80 వేల మంది ఢిల్లీ పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లు, యాంటీ -డ్రోన్ సిస్టమ్స్ను ఉపయోగిస్తున్నారు.
- కమాండో ఆపరేషన్లలో ఆరితేరిన జవాన్లు, అత్యాధునిక ఆయుధాలపై ట్రైనింగ్ తీసుకున్న మహిళా కమాండోలను కూడా రంగంలోకి దించారు. 400 మంది ఫైర్ సిబ్బందితో పాటు 450 క్విక్ రియాక్షన్ టీమ్స్ రెడీగా ఉంటాయి.
- స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలను ఈ నెల 8, 9,10వ తేదీల్లో రద్దు చేశారు. మెడిసిన్ వంటి వస్తువులు డెలివరీ చేయొచ్చు.
- జీ20 సమిట్ జరుగుతున్నప్పుడు సాధారణ, షెడ్యూల్లో లేని విమానాల ల్యాండింగ్, టేకాఫ్కు షెడ్యూల్డ్ ఎయిర్లైన్ ఆపరేటర్లు అనుమతి ఇవ్వరు. జీ20 కోసం వేసిన స్పెషల్ ఫ్లైట్స్ మాత్రమే నడుస్తుంటాయి.
- ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్(ఎఫ్ఆర్ఎస్)ను ఉపయోగించి ఎంత మందిలో ఉన్నా అనుమానితుడిని ఇట్టే గుర్తు పట్టే కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనికోసం స్పెషల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ తయారు చేశారు.
- నార్త్ జోన్లో అధికారులు 100కు పైగా రైళ్లను రద్దు చేశారు. మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు.
న్యూఢిల్లీ: జీ–20 సమిట్కు ఢిల్లీ సిద్ధమవుతోంది. 19 దేశాల అధ్యక్షులు, యూరోపియన్ యూనియన్ కూటమిలోని 27 దేశాల ప్రెసిడెంట్లు, ప్రతినిధులతో పాటు 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు జీ20 సమిట్కు అటెండ్ అయ్యేందుకు ఢిల్లీకి వస్తున్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో ఈ సమిట్ జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ సహా అగ్రరాజ్యాల అధినేతలు రెండ్రోజుల పాటు దేశ రాజధానిలోనే మకాం వేయనున్నారు. సుమారు 10వేల మంది అతిథులు వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఢిల్లీ మొత్తం కేంద్ర బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. సమిట్లో సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీని అధికారులు ఉపయోగిస్తున్నారు. అడుగడుగునా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బేస్డ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరుగెత్తినా.. అరిచినా.. వంగినా.. అనుమానాస్పదంగా తిరిగినా.. గోడలు దూకినా గుర్తించే స్పెషల్ సాఫ్ట్వేర్ డిజైన్తో తయారు చేసిన కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. ముఖంపై కనిపించే ఎక్స్ప్రెషన్స్ ఆధారంగా అనుమానితుడిని 90% గుర్తు పట్టే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
విధుల్లో 1.40 లక్షల మంది సెక్యూరిటీ ఆఫీసర్లు వివిధ దేశాధినేతలు తిరిగే సెంట్రల్ ఢిల్లీ ఏరియా మొత్తాన్ని హై-సెక్యూరిటీ జోన్గా మార్చేశారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ గగనతలంపై ఏ అనుమానాస్పద వస్తువు కనిపించినా సరే కూల్చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాల కోసం 1.40 లక్షల మంది సెక్యూరిటీ సిబ్బందితో సహా 80వేల మంది ఢిల్లీ పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లు, యాంటీ -డ్రోన్ సిస్టమ్స్ను ఉపయోగిస్తున్నారు. 23 ఇంటర్నేషనల్ హోటళ్లలో వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ప్రతినిధులకు బస ఏర్పాటు చేశారు. సమిట్ జరిగే చుట్టు పక్క ప్రాంతాల్లోని అన్ని బిల్డింగ్లపై స్పైపర్లు అలర్ట్ గా ఉంటారు.
సుఖోయ్ జెట్స్ తో గగనతలంపై పహారా
జీ20 సమిట్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ఢిల్లీ మొత్తాన్ని యుద్ధ విమానాలు పహారా కాస్తుంటాయి. హై టెక్నాలజీ డ్రోన్లను కూడా కేంద్రం రంగంలోకి దించింది. ఢిల్లీ గగనతలంపై రాఫెల్, మిరాజ్-2000, సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాలను మోహరిస్తున్నది.
నార్త్జోన్లోని రైళ్లన్నీ బంద్
నార్త్ జోన్లో అధికారులు 100కు పైగా రైళ్లను రద్దు చేశారు. మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రగతిమైదాన్లోని భారత్ మండపంలో సమిట్ జరుగుతుంది. దౌలా కౌన్, ఖాన్ మార్కెట్, జన్పథ్, బికాజీ కామా ప్లేస్ 9, 10వ తేదీల్లో మూసేశారు. రెస్టారెంట్లు, థియేటర్లు మూసి ఉంటాయి.
గుంపులో ఉన్నా ఇట్టే పట్టేస్తరు
ఫేసియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్(ఎఫ్ఆర్ఎస్)ను ఉపయోగించి ఎంత మందిలో ఉన్నా అనుమానితుడిని ఇట్టే గుర్తు పట్టే కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనికోసం స్పెషల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ తయారు చేశారు. ఇందులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, టెర్రరిస్టులు, ఖలిస్తానీ వేర్పాటు వాదుల ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేశారు. మొత్తం 3లక్షల మంది అనుమానితుల డేటా ఇందులో ఉంటుంది.
ఎఫ్ఆర్ఎస్తో కూడిన కెమెరా ప్రతి ఒక్కరి ఫేస్ను స్కాన్ చేస్తుంది. రెండు కండ్లు, చిన్, ఫోర్ హెడ్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఆధారంగా సస్పెక్ట్ను గుర్తించేలా తీర్చిదిద్దారు. అప్లోడ్ అయిన వీడియోలు, ఫొటోల్లో ఉన్న వ్యక్తి సమిట్ ఏరి యాలో కనిపిస్తే కెమెరాకు దగ్గరలో ఉన్న పోలీసులకు అలర్ట్ వెళ్తుంది. డేటాబేస్లో ఉన్న అనుమానితుడిని 95% వరకు ఐడెంటిఫై చేయగలదు. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న కెమెరాల ఫీడ్ను కూడా పోలీసులు సీ4ఐ కమాండ్ రూమ్కు కనెక్ట్ చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్రోగ్రామ్, ఎఫ్ఆర్ఎస్ ఆధారంగా ఈ కెమెరాలను ఉపయోగిస్తారు.
నో ఫ్లై జోన్లోకి ఢిల్లీ
ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎయిర్మెన్కు నోటీసు జారీ చేసింది. జీ20 సమిట్ జరుగుతున్నప్పుడు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(ఐజీఐ)లో సాధారణ, షెడ్యూల్లో లేని విమానాల ల్యాండింగ్, టేకాఫ్కు షెడ్యూల్డ్ ఎయిర్లైన్ ఆపరేటర్లు అనుమతి ఇవ్వరు. జీ20 కోసం వేసిన స్పెషల్ ఫ్లైట్స్ మాత్రమే నడుస్తుంటాయి. జీ20 ప్రముఖుల ప్రత్యేక విమానాల షెడ్యూల్, వాటి అసోసియేట్ ఫ్లైట్స్ వివరాలను ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కి అధికారులు అందజేశారు. ఐఏఎఫ్, బీఎస్ఎఫ్, ఏవియేషన్ రీసెర్చ్ ఫ్లైట్స్ జీ20 సమిట్ కోసం ఉపయోగిస్తున్నారు. ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లను ఎయిర్బోర్న్ లేదా ఇతర మిషన్ల (క్యాజువాలిటీ/మెడికల్ ఎమర్జెన్సీ) కోసం వాడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన విమానం/హెలికాప్టర్లు గవర్నర్ లేదా సీఎం కోసం ఉపయోగిస్తారు. అన్ షెడ్యూల్డ్ విమానాలు ఐజీఐ చుట్టూ 300 కి.మీ రేడియస్లో వచ్చేందుకు అనుమతి లేదు. రోహిణి హెలిపోర్ట్ మూసేశారు. ఏ విమానం రావాలన్నా.. హోం ఎఫైర్స్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సఫ్దార్జంగ్ ఎయిర్పోర్ట్ను క్లోజ్ చేశారు. ఐఏఎఫ్ హెలికాప్టర్లు ఎమర్జెన్సీ, వీవీఐపీ విధుల కోసం ఉంచారు. బీఎస్ఎఫ్/ఐఏఎఫ్ హెలికాప్టర్లు ఎన్ఎస్జీ బ్యాకప్కు సపోర్ట్గా ఉంటాయి.
రంగంలోకి కమాండో ఆపరేషన్లు చేసిన జవాన్లు
భద్రతా సిబ్బందిలో కొందరు కమాండో ఆపరేషన్లలో ఆరితేరిన జవాన్లు కూడా ఉన్నారు. అత్యాధునిక ఆయుధాలపై ట్రైనింగ్ తీసుకున్న మహిళా కమాండోలను కూడా రంగంలోకి దించారు. ఏదైనా విపత్తు సంభవిస్తే వెంటనే రంగంలోకి దిగేందుకు 400 మంది ఫైర్ సిబ్బందితో పాటు 450 క్విక్ రియాక్షన్ టీమ్స్ను సిద్ధం చేశారు. ఎక్కడికక్కడ అంబులెన్సులు, ఫైరింజన్లు మోహరించారు. కెమికల్, రేడియోలాజికల్, వెపన్స్ అటాక్, ఏరియల్ అటాక్, ప్రొటెస్ట్స్ ఇలా.. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేలా భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 10 వేల మంది పోలీసులు డ్యూటీలో ఉంటారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎన్ఎస్జీ, ఎస్పీజీ, ఐబీ, రా, ఎస్ఎస్బీ, హిట్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్, యాంటీ డ్రోన్ టీమ్స్విధుల్లో ఉంటారు.
ఈ నెల 8 నుంచి 10 వరకు డెలివరీ సేవలు రద్దు
ఈ నెల 8, 9,10వ తేదీల్లో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలు రద్దు చేశారు. బ్లింకిట్, జెప్టో.. ఈ– కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి సంస్థల డెలివరీలకూ అనుమతి లేదు. ఈ ఆంక్షలు 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ దాకా అమల్లో ఉంటాయి. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. మెడిసిన్ వంటి వస్తువులు డెలివరీ చేయొచ్చు. వైద్య, పోస్టల్ సేవలు అనుమతిస్తారు. మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు. 8న (శుక్రవారం) ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని కంపెనీలకు ఢిల్లీ ప్రభుత్వం కోరింది.