హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో యాంటీ జెన్ టెస్టులు మొదలయ్యాయి. జస్ట్ అరగంటలోనే రిజల్ట్స్ ఇచ్చే ఈ టెస్టులను గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని దవాఖాన్లలో ప్రారంభించారు. మొదటి రోజు ఒక్కో చోట 10 నుంచి 25 శాంపిల్స్ మాత్రమే తీసుకున్నారు. రియల్టైం ఆర్టీపీసీఆర్ (రివర్స్ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) టెస్టు లాగానే యాంటీ జెన్ టెస్టులకూ ముక్కు, గొంతు కలిసే చోట (నాసో ఫారింజియల్ రీజియన్) నుంచి స్వాబ్లతో శాంపిళ్లను తీసుకుంటారు. ఆర్టీపీసీఆర్లో వైరస్ జీన్ను గుర్తిస్తే.. ఈ యాంటీజెన్ టెస్టులో వైరస్ ప్రొటీన్ను గుర్తిస్తారు. కరోనా సోకిన తర్వాత పది నుంచి 14 రోజుల పాటు యాంటీజెన్ ప్రొటీన్ మన శరీరంలో ఉంటుంది. లక్షణాల్లేని పేషెంట్లలో పది రోజుల వరకు, లక్షణాలున్నోళ్లలో 14 రోజుల వరకూ ఉంటుంది. ఈ టెస్టులో పాజిటివ్ వస్తే వైరస్ ఉన్నట్టే లెక్క. ఒకవేళ వైరస్ లక్షణాలు ఉండి నెగెటివ్ వస్తే మాత్రం మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ గైడ్లైన్స్లోనూ పేర్కొంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేటెడ్ హాస్పిటల్స్(ఎన్ఏబీహెచ్) అన్నింటికీ ఈ టెస్టులు చేసే అవకాశం ఇవ్వాలని పోయిన నెల 14న ఇచ్చిన గైడ్లైన్స్లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్నవాళ్లకు, ఆపరేషన్లకు ముందు పేషెంట్లకు, డెలివరీలకు ముందు గర్భిణులకు, వృద్ధులకు ఈ టెస్ట్ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని సూచించింది. ఈ టెస్టులు, రిజల్ట్ వివరాలనూ ఐసీఎంఆర్కు తప్పనిసరిగా చెప్పాలి.
ఇంకొన్ని రోజుల్లో యాంటిబాడీ టెస్టులు
రాష్ట్రంలో కరోనా ఎంతమందికి వచ్చి పోయిందో తెలుసుకునేందుకు యాంటీ బాడీ టెస్టులు చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. అందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్లోని ప్రివెంటివ్ మెడిసిన్ ఇనిస్ట్యూట్స్లో టెస్టులు చేసేందుకు పరికరాలనూ పెట్టించింది. కరోనా పోరులో ముందున్న డాక్టర్లు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులకు ముందుగా ఈ టెస్టులు చేయనున్నారు. ఏదైనా వైరస్గానీ, బ్యాక్టీరియాగానీ మన శరీరంలోకి ఎంటరైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు మన రోగ నిరోధక వ్యవస్థ ఈ యాంటీబాడీలను పుట్టిస్తుంది. ఈ యాంటీ బాడీలు ఆ రోగకారక క్రిములతో పోరాడి నిర్వీర్యం చేస్తాయి. రక్తంలో ఈ యాంటీ బాడీస్ 5 రకాలుంటాయి. వీటిలో ముఖ్యమైనవి ఐజీఎం, ఐజీజీలు. ఏదైనా క్రిమి ఎంటరయ్యాక ముందు ఐజీఎం యాంటీ బాడీలు పుడతాయి. ఆ క్రిమితో ఫైట్ స్టార్ట్ చేస్తాయి. 22 రోజుల వరకు రక్తంలో ఉంటాయి. క్రిమి ఎంటరయ్యాక 10 రోజులకు ఐజీజీ యాంటీబాడీలు పుడతాయి. ఇవి 6 నెలల వరకు ఉంటాయి. ఆ క్రిమిని అంతం చేయడంలో వీటిదే ముఖ్య పాత్ర. వీటిలో మళ్లీ 4 రకాలుంటాయి. రక్తంలోని సీరమ్ను టెస్ట్ చేయడం ద్వారా ఈ ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీల ఉనికి తెలుసుకోవచ్చు. టెస్టులో ఐజీఎం యాంటీబాడీస్ పాజిటివ్ వస్తే వైరస్ సోకి పది రోజుల లోపే అవుతున్నట్టు. ఐజీఎం, ఐజీజీ రెండూ పాజిటివ్ వస్తే వైరస్ సోకి10 నుంచి 22 రోజులు అవుతున్నట్టు లెక్క. ఐజీజీ యాంటీబాడీసే పాజిటివ్ వస్తే వైరస్ వచ్చి నయమైపోతున్నట్టు లేదా పూర్తిగా నయమైపోయినట్టు భావిస్తారు.