రజనీకాంత్​ కు సిగ్గు లేదు... ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రజనీకాంత్​ కు సిగ్గు లేదు... ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

 ఎన్టీఆర్​ శతజయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్​ 28) విజయవాడలో సభ జరిగింది.  . ఈ సందర్భంగా రజనీకాంత్​  చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని .  ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుండగా...  వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతుగా ఉన్న రజినీకాంత్, సిగ్గు శరం లేకుండా ఇప్పుడు  చంద్రబాబును పొగుడుతూ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఎలా పాల్గొన్నాడని ప్రశ్నించారు.  పవన్​ కళ్యాణ్​ ను బ్లాక్​ మెయిల్​ చేసేందుకే చంద్రబాబు...రజనీకాంత్​తో అబద్దాలు చెప్పించారని ఆరోపించారు.  పవన్​ కళ్యాణ్​ ఏది మంచో.. ఏది చెడో గ్రహించుకోవాలని కొడాలి నాని హితవు పలికారు.

రజనీకాంత్​కు ఏపీ రాజకీయాలపై అవగాహన లేదు


రజనీకాంత్​ కు ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడారని కొడాలి నాని అన్నారు.  మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు హాస్పటల్లో పడుకునే, రజనీకాంత్ ఏం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చాడని  ప్రశ్నించారు.  యుగపురుషుడు ఎన్టీఆర్​ జీవించి ఉన్నప్పుడు ఆయన పట్ల రజనీకాంత్​ ఎలా ప్రవర్తించాడో అందరికి తెలుసంటూ... ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ రజనీకాంత్​ చేసిన వ్యాఖ్యలను తెలుగు ప్రజలు పట్టించుకోరని కొడాలి నాని అన్నారు. 

రజనీకాంత్​  ఏమన్నారంటే...


నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిధిగా పాల్గొన్న విషయం విదితమే.. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న రజనీకాంత్.. ఈ సభలో జనాన్ని చూస్తుంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తోంది. కానీ, అనుభవం వద్దురా రజనీ రాజకీయం మాట్లాడొద్దంటోంది.  చంద్రబాబు నాకు 30 ఏళ్లుగా మిత్రుడు.. చంద్రబాబు ఐటీ విజన్ ఏంటో ప్రపంచానికి తెలుసు. గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని అప్పుడే అనుకున్నాను. చంద్రబాబు పెద్ద విజనరీ.. చంద్రబాబు విలువ ఇక్కడ ఉన్నవాళ్లకంటే.. బయట ఉన్న వాళ్లకే తెలుసు. ఎప్పుడూ అభివృద్ధి గురించే చంద్రబాబు మాట్లాడేవారు. హైదరాబాద్‌లో సైబరాబాద్ సైడ్ వెళ్లాను.. హైదరాబాద్‌కు వస్తే ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్ లో ఉన్నానో అర్థం కాలేదు. హైదరాబాద్ అభివృద్ధి అవ్వడంతో చంద్రబాబు పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబు విజన్ 2047 సాకారం అవుతుందని రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు.