
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజు రోజుకూ కేసుల నమోదు సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇవాళ(సోమవారం) ఇప్పటి వరకు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. 85 మంది చనిపోయారు.ఇందులో ఎక్కువగా నెల్లూరు జిల్లాలో 12 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,969కి పెరిగింది.
గత 24 గంటల్లో 56,490 శాంపిల్స్ పరీక్షించగా 10,004 మందికి కరోనా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరిలో 1,383, పశ్చిమ గోదావరి 1,142, నెల్లూరు 1,086, శ్రీకాకుళం 1,023 జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,771కి చేరింది.