
డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. డాక్టర్ పై జరిగిన దాడి ఘటనపై విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. సుధాకర్పై దాడి చేసిన పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
డాక్టర్ పై జరిగిన దాడికి సంబంధించి.. గురువారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు విశాఖ సెషన్స్ జడ్జి. శుక్రవారం ఈ కేసును విచారించిన హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. డాక్టర్ సుధాకర్ ఒంటిపై గాయాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని.. ప్రభుత్వ నివేదికలో ఆ గాయాల ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రభుత్వ నివేదికపై అనుమానాలు ఉన్నాయని.. అందుకే సీబీఐ విచారణకు ఆదేశించామని కోర్టు చెప్పింది.