ఏపీ, తెలంగాణలో బీపీ, జీర్ణాశయ వ్యాధులు ఎక్కువ

ఏపీ, తెలంగాణలో  బీపీ, జీర్ణాశయ వ్యాధులు ఎక్కువ

తెలుగు రాష్ట్రాల్లో బీపీ,షుగర్ ,జీర్ణాశయ వ్యాధుల విజృంభణ ఆందోళన కల్గిస్తోంది. వీరిన బారిన పడుతున్న వారి సంఖ్య దేశ సగటుతో పోల్చితే  తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.

భారతదేశపు అత్యున్నత వాణిజ్య సంఘం, అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా (అసోచామ్‌) తమ ‘ఇల్‌నెస్‌ టు వెల్‌నెస్‌ ’(అనారోగ్యం నుంచి ఆరోగ్యం) ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణాకు నిర్థిష్టమైన అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. దేశంలో రోజు రోజుకీ వృద్ధి చెందుతున్న నాన్‌ కమ్యూనికబల్‌ వ్యాధులు (సంక్రమణేతర వ్యాధులు) భారంపై నిర్వహించిన  భారతదేశంలో అతిపెద్ద ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ అధ్యయన నివేదిక ఇది. ఈ అధ్యయనం విడుదల చేసిన అనంతరం వర్ట్యువల్‌గా ఓ చర్చా కార్యక్రమాన్ని..  ‘వ్యాప్తి చెందని వ్యాధులు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలకు ఎదురవుతున్న నూతన ఆరోగ్య సవాళ్లు’ శీర్షికన నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలను ‘నాన్‌ కమ్యూనికబల్‌ డిసీజెస్‌ ఇన్‌ ఇండియా’ శీర్షికన విడుదల చేశారు. దీనిలో 21 రాష్ట్రాల్లోని 2,33,672 మంది ప్రజలతో పాటు 673 ప్రజా ఆరోగ్య కేంద్రాలను కవర్‌ చేయడంతో పాటుగా ఎన్‌సీడీలు వృద్ధి చెందడానికి గల కారణాలు, ఈ వ్యాధుల బారిన పడిన ప్రజల సామాజిక ప్రొఫైల్‌ను విశ్లేషించారు.

 

ఈ అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలో 16.19% మంది అత్యంత కీలకమైన ఎన్‌సీడీల బారిన పడ్డారు. ఇది జాతీయ  సరాసరి 11.62%తో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ రాష్ట్రాలలో  సంక్రమణేతర వ్యాధులు అయినటువంటి హైపర్‌ టెన్షన్‌, జీర్ణాశయ వ్యాధులు, మధుమేహం, న్యూరోలాజికల్‌ వ్యాధులు వంటివి జాతీయ సరాసరి ప్రాబల్య రేటుతో పోల్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంది.