
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ స్టూడెంట్లకు సేవలు అందించడానికి అపోలో మెడ్ స్కిల్స్ ఉజ్బెకిస్థాన్లోని జార్మేడ్ యూనివర్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అపోలో హాస్పిటల్స్ అనుబంధ సంస్థ అపోలో మెడ్ స్కిల్స్ ఇందుకోసం ‘జాప్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం.. జార్మేడ్ యూనివర్సిటీలో జాప్స్టూడెంట్లకు చదువు చెప్పడానికి భారతీయ ప్రొఫెసర్లను, అధ్యాపకులను, నిపుణులను అపోలో పంపిస్తుంది. జార్మేడ్ యూనివర్సిటీలోని సమర్ఖండ్, బుకార క్యాంపస్లలో వీళ్లు ఇంగ్లిష్లోనే బోధిస్తారు.
ఎఫ్ఎంజీజీ–నెక్స్ట్ సహా పలు పరీక్షల కొరకు మొదటి సంవత్సరం నుంచే శిక్షణ ఇస్తారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్దేశించిన నియమావళి ప్రకారం ఐదు సంవత్సరాల సిలబస్ను అపోలో మెడ్ స్కిల్స్ పర్యవేక్షణలో బోధిస్తారు. సంవత్సరంపాటు జార్మేడ్ హాస్పిటల్స్లో క్లినికల్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. విద్యార్థులు సెలవుల్లో అపోలో అనుబంధ సంస్థలలో క్లినికల్ అబ్జర్వేషన్ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు. ఆరేళ్ల కోర్సుకు రూ.35 లక్షలలోపు ఖర్చవుతుందని అపోలో తెలిపింది.