వృద్ధాప్య పెన్షన్లకు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి

వృద్ధాప్య పెన్షన్లకు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి
  • 57ఏళ్ల వయసు ఉన్న వాళ్లంతా దరఖాస్తు చేసుకోవాలి
  • ఈసేవ/మీసేవలో దరఖాస్తు ఉచితం
  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా

హైదరాబాద్: తగ్గించిన వయో పరిమితి ని అనుసరించి కొత్త వృద్ధాప్య పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన వాళ్ళు ఈ నెల 31 లోగా ఈ సేవ/మీ సేవ ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.  57 ఏళ్ల వయసు వచ్చిన వారందరికీ కొత్త వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చేందుకు అవరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లకు ఆదేశాలిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరు అంటే ఆగస్టు 31వ తేదీలోగా ఈ సేవ లేదా మీ సేవ ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా దరఖాస్తులను స్వీకరించాలని, తక్షణమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ లకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు. వృద్ధాప్య పెన్షన్ల కోసం 57 ఏండ్ల వయోపరిమితి కలిగిన వాళ్లంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. 
ఆసరా పెన్షన్ల లో భాగంగా 57 ఏండ్ల కు తగ్గించిన వయోపరిమితి మేరకు లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అర్హులైన వారు తక్షణమే ఈసేవ, మీ సేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఈ ప్రక్రియను ప్రారంభించాలి. ఆగస్టు 31 లోగా దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాలి. జీఓ 75 ప్రకారం పుట్టిన తేదీ ధృవీకరణ, ఓటర్ కార్డు తదితర పత్రాలను దరఖాస్తు తో పాటు జత చేయాలి.
ఈసేవ/మీసేవలో దరఖాస్తు ఉచితం
వృద్ధాప్య ఫించన్ కోసం దరఖాస్తు చేసుకునే వారి వద్ద ఎలాంటి సేవల రుసుములు తీసుకోవద్దని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. సంబంధిత రుసుములు ప్రభుత్వమే చెల్లిస్తుంది ఈ సేవ కమిషనర్ కు సూచిస్తూ ఆదేశాలిచ్చారు. అందరికీ న్యాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకనుగుణంగానే అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా పెన్షన్లు అందిస్తున్నామని, పెన్షన్ల మొత్తం వృద్దులకు రూ. 2016, దివ్యాంగులకు రూ. 3016చొప్పున అందజేస్తామని ఆయన వివరించారు.